Saturday, May 4, 2024

పామాయిల్ రైతులకు ప్రోత్సాహకాలివ్వండి.. లోక్‌సభలో ఎంపీ నామా విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో పామాయిల్ సాగును పెంచాలనే లక్ష్యంతో 2021లో ఎన్ఎంఇఓ-ఓపీ పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకానికి రూ. 11,040 కోట్లు కాగా, ఇందులో కేంద్రం వాటాగా రూ.8844 కోట్లని, రాష్ట్ర వాటాగా రూ.2,196 కోట్లుగా నిర్ణయించినట్టు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం వెల్లడించారు. దేశంలో వార్షిక పామాయిల్ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు ప్రస్తుత దేశం ఉత్పత్తి అంచనా, ఎగుమతి, దిగుమతుల వివరాలను వెల్లడించాలని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కనీస మద్దతు ధర, ఇతర ఆర్థిక సహాయ ప్రోత్సాహకాలను అందించడం ద్వారా పామాయిల్ ఉత్పత్తి చేసే రైతులను ప్రోత్సహించడానికి ఒక సమగ్ర పథకాన్ని రూపొందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోందా? లోక్‌సభలో ప్రశ్నించారు. ఐదేళ్లలో దేశంలో ఉన్న డిమాండ్, ఉత్పత్తి ఆధారంగా అవసరమైన పామాయిల్ ను దిగుమతి చేసుకున్నట్టు తోమర్ వెల్లడించారు. తోటల ఏర్పాటు, విత్తన నర్సరీలు, మైక్రో ఇరిగేషన్, బోర్ వెల్, పంప్ సెట్, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, సోలార్ పంపులు, హార్వెస్టింగ్ టూల్స్, కస్టమ్ హైరింగ్ సెంటర్, అధికారులు, రైతులకు శిక్షణ, పాత తోటల రీప్లాంటింగ్ మెటీరియల్ ఖర్చు వంటి కార్యక్రమాలను ఎన్‌ఎంఈఓ పథకం కింద చేపడుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement