Tuesday, April 30, 2024

క్రికెటింగ్‌ లీగ్స్‌ భవితవ్యం అనుమానమే : సౌరబ్‌ గంగూలీ

క్రికెటింగ్‌ లీగ్స్‌ భవితవ్యంపై బీసీసీఐ మాజీ సారథి సౌరబ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నాలుగైదు ఏళ్లలో కొన్ని క్రికెటింగ్‌ లీగ్స్‌ మాత్రమే ఉంటాయని అన్నాడు. క్రికెటింగ్‌ లీగ్స్‌ ముఖ్యం కాదనే విషయాన్ని ఆటగాళ్లు గ్రహిస్తారని చెప్పాడు. దేశానికి ఆడటంతో పాటు లీగ్స్‌కు ఆడడం కూడా ముఖ్యమనే విషయాన్ని వాళ్లు గుర్తిస్తారు అని గంగూలీ అన్నాడు.
క్రికెటింగ్‌ లీగ్స్‌లో ఐపిఎల్‌ ప్రత్యేకమైనదని, భిన్నమైన వాతావరణంలో ఈ టోర్నీని నిర్వహిస్తారని అతను తెలిపాడు.

అంతే కాదు ” ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్న బిగ్‌ బాష్‌ లీగ్‌ కూడా అద్భుతంగా ఉంటోంది. ఈ మధ్యే మొదలైన దక్షిణాఫ్రికా లీగ్‌ కూడా ఆసక్తిగా ఉంది. గత మూడు వారాలుగా ఆ టోర్నీని గమనిస్తున్నా” అని గంగూలీ వెల్లడించాడు. కొత్తగా వచ్చిన లీగ్స్‌లో ఆడేందుకు చాలామంది క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకనే లీగ్స్‌ వేలంలో పోటీ కనిపిస్తోంది అని గంగూలీ చెప్పాడు. ఇప్పటి వరకైతే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక లీగ్‌లో ఆడాలని ఆరాటపడుతున్నారు. అందుకనే లీగ్స్‌ వేలంలో అంత పోటీ కనిపిస్తోంది. అయితే ఈ లీగ్స్‌లో చాలా వరకు వచ్చే ఐదేళ్లలో కనుమరుగవుతాయి.

ఆర్థికంగా నిలదొక్కుకునే లీగ్స్‌ మాత్రమే కొనసాగుతాయి అని గంగూలీ తెలిపాడు. అంతే కాదు క్రికెట్‌ను ప్రోత్సహించే వ్యవస్థ ఉండడం చాలా ముఖ్యమని అతను అభిప్రాయపడ్డాడు. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు నాలుగేళ్లు అధ్యక్షుడిగా పని చేశాను. ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్‌గా మూడేళ్లు కొనసాగాను. భారత్‌ తరపున ఐసీసీకి ప్రాతినిద్యం వహించాను. క్రికెట్‌ వ్యవస్థ గురించి తెలుసుకున్నా అని ఈ మాజీ క్రికెటర్‌ వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement