Thursday, May 2, 2024

Hara Hara Mahadev | అమర్‌నాథ్‌ యాత్రలో మ‌రో ఐదుగురు మృతి.. మొత్తం 19 మంది శివైక్యం

అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. గడిచిన 24గంటల వ్యవధిలో గుండెపోటుతో ఐదుగురు యాత్రికులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయాల్లో జరిగే ఈ యాత్రకు వెళ్లిన వారిలో ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరినట్లు తెలిపారు. తాజా మృతుల్లో అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గాం మార్గంలో ముగ్గురు, గాందర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ మార్గంలో ఇద్దరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతులలో నలుగురిని యూపీ, మధ్యప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. మరొక వ్యక్తి వివరాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు.

ఇటీవల అమర్‌నాథ్‌ యాత్ర విధులకు వెళ్లిన ఓ ఐటీబీపీ అధికారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అమర్‌నాథ్‌ యాత్రికులు, విధులకు వెళ్లిన భద్రతా సిబ్బంది మరణానికి కారణం అక్కడి అసాధారణ పరిస్థితులే అని అధికారులు చెబుతున్నారు. అధిక ఎత్తులో ఆక్సిజన్‌ గాఢత తక్కువగా ఉండటం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 1 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement