Monday, May 6, 2024

Jammu Kashmir | కాశ్మీర్‌లో కాల్పులు.. వలస కార్మికుడి మృతి, మరొకరికి గాయాలు !

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ముష్కరులను పట్టుకునేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

శ్రీ నగర్‌లోని హబ్బా కడల్ ప్రాంతంలోని షాహీద్ గంజ్ వద్ద బుధవారం రాత్రి 7 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన అమృత్ పాల్ సింగ్‌గా గుర్తించారు. అమృత్ పాల్ సింగ్ శ్రీ నగర్‌లో వీధి వ్యాపారిగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇక గాయపడిన మరో వ్యక్తిని రోహిత్‌ అని వెల్లడించారు.

ఏకే 47తో ముష్క‌రులు పంజాబ్ కార్మికులపై కాల్పుల‌కు తెగ‌బ‌డినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక వలస కార్మికుల మీద జరుగుతున్న వరుస దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఏడాదిలో స్థానికేతరులపై జరిగిన తొలి దాడిగా పోలీసులు వెల్లడించారు. గ‌తేడాది కాశ్మీర్ లోయ‌లోని అనంత్ నాగ్, షోపియాన్ ప్రాంతాల్లో వలస కార్మికుల‌పై దాడులు జ‌రిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement