Saturday, April 27, 2024

National : బీహార్‌లో రైలులో మంట‌లు…

బీహార్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ-హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని పాట్నా-డీడీయూ రైల్వే సెక్షన్‌లో మంగళవారం అర్థరాత్రి దానాపూర్-లోకమాన్య తిలక్ టెర్మినస్ హోలీ స్పెషల్ రైలులో మంటలు చెలరేగాయి.

- Advertisement -

భోజ్‌పూర్ జిల్లా పరిధిలోని బిహియా- కరిసాత్ స్టేషన్‌ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హోలీ ప్రత్యేక రైలులోని ఏసీ బోగీలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయాందోళనకు గురై ప్రాణాలను కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు దూకేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన తర్వాత యూపీ రైల్వే లైన్‌లోని ఓహెచ్‌ఈలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గంలో నడిపారు. నేటి (బుధవారం) ఉదయం ట్రాక్‌ను క్లియర్ చేసిన తర్వాత, నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్, పాట్నా ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లను వాటి షెడ్యూల్ మార్గం గుండా రాకపోకలకు అనుమతించారు. ఈ హోలీ స్పెషన్‌ రైలులో అగ్నిప్రమాదానికి గురైన కోచ్‌ను తొలగించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement