న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ విధానం కోసం కేంద్రంపై ఎటువంటి పోరాటానికైనా తగ్గేదేలేదని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు గత కొద్ది రోజులుగా లోక్సభ, రాజ్యసభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయటంతో పాటు ధాన్యం కొనుగోలుపై వాయిదా తీర్మానం నోటీసులు, వాకౌట్, గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. అందులో భాగంగా బుధవారం లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు మరోమారు ధాన్యం సేకరణపై వాయిదా తీర్మానంపై టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులిచ్చారు.సభలో ఖచ్చితంగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన జాతీయ విధానం అవలంభించాలని ఈ విషయంపై లోక్సభలో చర్చించాలని పట్టుబట్టారు. ఎంపీ నామా నేతృత్వంలో ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభలో ఆందోళన చేశారు. కేంద్రం మొండి వైఖరికి నిరసనగా సభ నుండి టీఆర్ఏస్ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లైబ్రరీని సందర్శించిన టిబెట్ నేతలు
భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సందర్శించేందుకు వచ్చిన టిబెట్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ డోమ్ల టెసిరింగ్ బృందం పార్లమెంట్ లైబ్రరీలో ఎంపీ నామా నాగేశ్వరరావును కలిశారు. పార్లమెంట్ లైబ్రరీలో పుస్తకాలను టిబెట్ ఎంపీల బృందం పూర్తిగా పరిశీలించారు. అనంతరం భారత రాజ్యాంగ ప్రతిని కూడా చూశారు. ఈ సందర్భంగా టిబెట్ పార్లమెంట్ సభ్యులను భారత పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్ అయిన నామా నాగేశ్వరరావు లైబ్రరీ హాల్లో వారిని ఘనంగా సన్మానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..