Tuesday, April 30, 2024

వేగంగా వృద్ధి చెందుతున్న దేశీయ ఈవీ టూ వీలర్‌ పరిశ్రమ

ఫేమ్‌ 2 సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం కోత విధించినప్పటికీ కేంద్ర, రాష్ట్రాల సానుకూల విధానాలతో దేశంలో విద్యుత్‌ టూ వీలర్ల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్నదని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అభిప్రాయపడింది. మన దేశం ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ ఎగుమతుల హబ్‌గా మారుతుందని తెలిపింది. ప్రస్తుతం టీవీఎస్‌ ఐక్యూబ్‌ పేరుతో విద్యుత్‌ స్కూటర్‌ను విక్రయిస్తోంది. వివిధ కేటగిరి కస్టమర్ల కోసం కంపెనీ పలు మోడల్స్‌లో విద్యుత్‌ వాహనాలను తీసుకు రానుంది. దేశంలో ఈవీ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతున్నట్లు టీవీఎస్‌ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

కేంద్రం ఉత్పత్తి ఆదారిత స్కీమ్‌ (పీఎల్‌ఐ) ఫేమ్‌ 2 సబ్సిడీ స్కీమ్‌తో పాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూల విధానాలను అనుసరిస్తున్నాయని, దీని వల్ల దేశంలో విద్యుత్‌ వాహనాల పరిశ్రమ మంచి వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఇలాంటి విధానాల మూలంగా దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు పెరగడంతో పాటు, ఎగుమతులు పెరుగుతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం పేమ్‌ 2 సబ్సీడిని ఒక కిలోవాట్‌కు ఇచ్చే సబ్సిడీని ప్రస్తుతం 10వేలకు పరిమితం చేసింది. అంతుకు ముందు ఇది 15 వేలు నుంచి 40 వేల వరకు ఉంది. టీవీఎస్‌ త్వరలోనే ఐక్యూట్‌లనే కొత్త వేరియంట్స్‌ను తీసుకురానుందని, దీనితో పాటు కొత్త విద్యుత్‌ టూ వీలర్‌ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది.

టీవీఎస్‌ ఐక్యూబ్‌ ప్రస్తుతం 130 నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉందని, ఈ సంఖ్యను రానున్న కాలంలో మరింత పెంచనున్నట్లు తెలిపింది. ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం 2వేల వరకు ఉన్నాయని వీటిని కూడా గణనీయంగా పెంచనున్నట్లు తెలిపింది. టీవీఎస్‌ మోటార్స్‌ బీఎండబ్ల్యూతో చేసుకున్న ఒప్పందం మూలంగా త్వరలోనే ప్రపంచ మార్కెట్ల కోసం ప్రత్యేక డిజైన్‌తో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. దేశంలో మొత్తం టూవీలర్స్‌లో 2022-23 ఆర్ధిక సంవత్సరంలో విద్యుత్‌ టూ వీలర్ల వాటా 4.7 శాతంగా ఉందని కంపెనీ తెలిపింది. టీవీఎస్‌ 91 వేల విద్యుత్‌ టూ వీలర్స్‌ను విక్రయించినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement