Wednesday, May 8, 2024

ఏప్రిల్‌ 1 నుంచి విద్యుత్‌ ఛార్జీలు పెరిగే అవకాశం.. ఈఆర్‌సీ చట్ట సవరణలో కసరత్తు చేస్తున్న అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం నేరుగా ఉండకుండా, విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లకు అధికారాలిస్తూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ కమిషన్‌ (ఈఆర్‌సీ) చట్టాన్ని ఇటీవల అసెంబ్లిలో సవరించారు. కరెంట్‌ బిల్లుల్లో ఇప్పటి వరకూ చెల్లిస్తున్న అడ్వాన్స్‌ కన్సంప్సన్‌ డిపాజిట్‌ (ఏసీడీ) ఛార్జీలతోపాటు ఫ్యూయెల్‌ కాస్ట్‌ అడ్జెస్ట్‌మెంట్‌ (ఎఫ్‌సీఏ) పేరిట కొత్త ఛార్జీలు వడ్డించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకుగానూ సవరించిన ఈఆర్సీ చట్టంలో రాష్ట్ర సర్కార్‌ కొత్త నిబంధనను చేర్చింది. తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ కమిషన్‌ (టీఎస్‌ఈఆర్సీ) నిబంధనలకు మూడో సవరణ చేస్తూ కొత్త రెగ్యులేషన్‌ను ప్రభుత్వం చేర్చింది.

ఇందుకు సంబంధించిన గెజిట్‌ను తెలంగాణ సర్కార్‌ ఆదివారం (ఫిబ్రవరి 12) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తాజా రెగ్యులేషన్‌ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు గెజిట్‌లో వెల్లడించింది. కొత్త రెగ్యులేషన్‌ యాక్ట్‌ ప్రకారం ప్రతి 3 నెలలకోసారి కరెంట్‌ కొనే ధర, నష్టాలకు తగ్గట్టు యూనిట్‌కు 30 పైసల చొప్పున ఎఫ్‌సీఏను వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. అంతకుమించి వసూలు చేయరాదని రెగ్యులేషన్‌లో పేర్కొంది. ఒకవేళ ఎఫ్‌సీఏ చార్జీలు తక్కువగా ఉంటే బిల్లు నుంచి ఆమొత్తాన్ని మినహాయించాలని తెల్పింది. రైతన్నల వ్యవసాయానికి ఇచ్చే ఎల్టీవీ కరెంట్‌కు మాత్రం ఎఫ్‌సీఏ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆ చార్జీలను సర్కారు నుంచి డిస్కంలు వసూలు చేసుకోవాలని తెలిపింది. వినియోగదారులకు బిల్లు ఇచ్చేటప్పుడు ఎఫ్‌సీఏ చార్జీలను తప్పనిసరిగా మెన్షన్‌ చేయాలని ప్రభుత్వం తన రెగ్యులేషన్‌లో సర్కారు తెలిపింది. పరిమితికి మించి వసూలు చేయాల్సి వస్తే కమిషన్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అనుమతి లేకుండా పరిమితికి మించి ఎఫ్‌సీఏ చార్జీలను వసూలు చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని రెగ్యులేషన్‌లో వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement