Tuesday, April 30, 2024

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య : మంత్రి గంగుల

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా నగరంలోని 28వ డివిజన్ అశోక్ నగర్ లోని దుర్గమ్మ గడ్డలో ఒక కోటి రూపాయలతో నిర్మించనున్న పాఠశాల భవనానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. నేటితరం విద్యార్థులకు ఎంత మంచి చదువు నందిస్తే వారు అంత మంచిగా చదువుకుంటారన్నారు. ప్రభుత్వం వారికి కార్పొరేట్ కు ధీటుగా విద్య అందిస్తుందని అన్నారు. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నామని అన్నారు. దుర్గమ్మ గడ్డ పాఠశాలలో కోటి 35 లక్షలతో రెండు అంతస్తుల భవనం, కాంపౌండ్ వాల్, తాగునీరు, టాయిలెట్, కిచెన్ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తమని తెలిపారు. నాలుగు నెలల్లో భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని, కరీంనగర్ లో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు.

రాజకీయాలకతీతంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలు పూర్త‌యితే కరీంనగర్ ప్రపంచంలోనే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు పెరిగి మన పిల్లల భవిష్యత్తు బంగారు మయమవుతుందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా ప్రపంచంలో మూడవది ఇండియాలో మొదటిదైన బిగ్ ఓ ఐలాండ్ ఫౌంటెన్ ను 69 కోట్లతో నిర్మిస్తున్నామని, నగరానికి సరికొత్త శోభను తీసుకువచ్చేందుకు ఆధునిక డిజైన్లతో 13 ఐలాండ్ లను నిర్మిస్తున్నామని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను 2వ గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నగరంలో కరెంటు,తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, 2 నుంచి 3 సంవత్సరాల్లో కరీంనగర్ రూపురేఖలు మారిపోయేలా ఆకర్షణీయమైన నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా… కరీంనగర్ లో మేము హోటల్ పెడుతామంటూ తాజ్ గ్రూప్ ముందుకు వస్తుందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, సుడా డైరెక్టర్ యూసుఫ్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement