Monday, April 29, 2024

ఈడీ వర్సెస్‌ షియోమీ, భౌతిక దాడులకు దిగారు.. ఈడీపై షియోమీ ఆరోపణలు

ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులపై చైనా ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ఇండియా సంచలన ఆరోపణలు చేసింది. తమ సిబ్బందిపై ఈడీ అధికారులు భౌతికంగా దాడికి దిగారని కోర్టుకు నివేదించింది. దర్యాప్తు సమయంలో తమ కంపెనీ సిబ్బందితో చాలా దారుణంగా వ్యవహరించారని చెప్పుకొచ్చింది. భారత విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) ఉల్లంఘిచారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు.. షియోమి కార్యాలయలపై దాడులు చేసింది. రూ.5,551 కోట్లను జప్తు చేసింది. అయితే ఈ విషయమై షియోమి కోర్టుకు వెళ్లగా.. జప్తును నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది. కోర్టుకు సమర్పించిన నివేదికలో షియోమీ కీలక విషయాలు పొందుపర్చింది.

విదేశాలకు నిధుల తరలింపు..

ఫిబ్రవరి నుంచి ఈడీ దర్యాప్తు చేస్తున్నదని, మాజీ ఎండీ మను కుమార్‌ జైన్‌తో పాటు ప్రస్తుత సీఎఫ్‌ఓ సమీర్‌ బీఎస్‌ రావును ఈడీ బెదిరించిందని తెలిపింది. తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు గురి చేసిందని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించినట్టు వివరించింది. అరెస్టులతో పాటు భౌతిక దాడులకు దిగిందని, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించిందని చెప్పుకొచ్చింది. చాలా రోజులుగా ఉద్యోగులు ఒత్తిడి భరించారని, చివరికి ఈడీ ఇబ్బందులు పడలేక వారికి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిపింది. షియోమి 2014లో భారత్‌లో అడుగుపెట్టింది. ఆ మరుసటి ఏడాది నుంచే నిధులు ఇతర దేశాలకు తరలించినట్టు ఆరోపణలు రావడంతో.. ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈడీ దర్యాప్తు చేస్తూ వచ్చింది. రూ.5,551 కోట్ల సమానమైన విదేశీ మారకద్రవ్యాన్ని విదేశాల్లో పని చేస్తున్న మూడు కంపెనీలకు పంపినట్టు ఆరోపణలు వచ్చాయి.

షియోమీ ఆరోపణలు అవాస్తవం..

షియోమీ చేసిన ఆరోపణలపై.. ఈడీ ఖండించింది. కంపెనీ అధికారులపై ఒత్తిడి తెచ్చామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. అస్సలు భౌతిక దాడులకు దిగలేని స్పష్టం చేసింది. షియోమీ తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించింది. ఈడీ అధికారులు విలువలకు గౌరవం ఇచ్చే సంస్థ అని, ఆధారాల సేకరణ కూడా సానుకూలమైన వాతావరణంలోనే కొనసాగిందని స్పష్టం చేసింది. షియోమీ సిబ్బందిపై ఎలాంటి దాడులకు పూనుకోలేదని వివరించింది. ఇవన్నీ షియోమీ సృష్టించిన కథనాలు అంటూ కొట్టిపారేసింది. ఆధారాలు.. సంస్థ ప్రతినిధులు కొన్నింటిని రాతపూర్వకంగా.. మరికొన్నింటిని ఈడీ ముందు మౌఖికంగా స్వచ్ఛందంగా సమర్పించామని తెలిపింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement