హైదరాబాద్, ఆంధ్రప్రభ: డీఎస్సీ దరఖాస్తు స్వీకరణకు గడువు ముగిసింది. ఇవ్వాల (శనివారం) రాత్రి ఏడు గంటల వరకు మొత్తం 1,76,530 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్ష ఫీజు చెల్లించింది మాత్రం 1,79,297 మంది ఉన్నారు. డీఎస్సీ దరఖాస్తులు ఈసారి కనీసం రెండు లక్షలు కూడా దాటకపోవడం గమనార్హం. అదే గతంలోనైతే డీఎస్సీ అంటే భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చేవి. కానీ ఈసారి 5,089 పోస్టులు మాత్రమే ఉండడంతోపాటు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అర్హత లేకపోవడం లాంటి కారణాలతో ఈసారి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య చాలా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్లో భాగంగా పోస్టుల భర్తీకుగానూ సెప్టెంబర్ 20 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొదట ఈనెల 21న దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీగా విద్యాశాఖ నిర్ణయించింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈనెల 28వ తేదీ వరకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. పరీక్ష ఫీజు చెల్లింపునకు శుక్రవారంతో గడువు ముగియగా, దరఖాస్తు స్వీకరణకు గడువు శనివారంతో ముగిసింది. అయితే శనివారం ఉదయం కొంత సేపు సర్వర్ డౌన్ కావడంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు.