Thursday, May 30, 2024

Follow Up | హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీహిల్స్ లో (ఆదివారం) డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ సీజ్ చేశారు. పంజాబ్ లోని ఓ ప్రముఖ యూనివర్శిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నవీన్, సాయిలను అరెస్ట్ చేశారు.

న్యూ ఇయర్ కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ విక్రయించేందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ లో బ్రౌన్ షుగర్ బయటపడడం ఇదే తొలిసారి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అప్పులు చేసి వాటిని తీర్చేందుకు ఇలా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నారాయణగూడ లో..

- Advertisement -

ఎక్సైజ్ పోలీసులు 9కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీబీఎస్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో బైక్ పై ఇద్దరు వచ్చారు. వారి కదలికలపై అనుమానం రావడంతో పోలీసులు వారిని ఆపి చెక్ చేయగా వారి వద్ద 9 కిలోల ఎండు గంజాయి దొరికింది. వారిద్దరూ ఒడిశా వాసులు. ఒడిశా నుండి గంజాయి తీసుకొచ్చి తెలంగాణలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. వారి నుండి బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులు.

మీర్ పేటలోనూ..

డ్రగ్స్ తరలిస్తోన్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో మత్తు పదార్థాలు విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నాలు చేస్తుండగా, పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి ఈ ముఠా డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయిన్, రూ.10 వేలు, ఓ బైక్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రాజేంద్రనగర్ లోనూ పట్టివేత

అటు, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంట్లో ఎస్ వోటీ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. శివరాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఇంట్లో రూ.2 లక్షల విలువైన 7.5 గ్రాముల డ్రగ్స్ ను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లు గుర్తించారు.

పటిష్ట నిఘా

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ సరఫరాపై పోలీసులు పటిష్ట నిఘా ఉంచారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. డ్రగ్స్ సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 120 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అటు, పబ్బులు, హోటళ్లు, ఈవెంట్స్ నిర్వాహకులకు కఠిన నిబంధనలు విధించారు. మైనర్లకు లిక్కర్ సప్లై చేయకూడదని, పబ్బుల్లో పరిమితికి మించి పాసులు జారీ చెయ్యొద్దని స్పష్టం చేశారు. పార్కింగ్, భద్రత అంశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సీసీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement