Friday, May 3, 2024

బొకేలు శాలువాలు వద్దు, నోట్ బుక్స్ స్టేషనరీ ఇవ్వండి.. విద్యాశాఖ‌ మంత్రి స‌బిత విజ్ఞ‌ప్తి

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : కొత్త సంవత్సరం సందర్భంగా తనను కలవటానికి వచ్చే వారు ఎవరూ బొకేలు,శాలువలు తీసుకురావొద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేసారు. ఇతర నేతలను, అధికారులను కలువటానికి వెళ్లేటప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. వృధా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాటి స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పెన్సిళ్లు, అంగన్ వాడీ పిల్లలకు మ్యాట్లు, చిన్న వాటర్ బాటిళ్లు, ఇతరత్రా వాటిని అందించాలని కోరారు. రానున్న నూతన సంవత్సరం 2023 సందర్భంగా అందరూ ఒక కొత్త నిర్ణయం తీసుకొని, అమలు చేయాలని కోరారు. నూతన సంవత్సరంతో పాటు జన్మదినాల సందర్భంగా ఇలాంటి సమాజ హిత కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

వివిధ కార్యక్రమాల సందర్భంగా కూడా ఇదే విధానాన్ని పాటించాలని కోరారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు ఈ దిశగా రానున్న జనవరి ఒకటో తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేసి జిల్లాలో ఓ సరికొత్త విధానానికి నాంది పలుకలన్నారు.. నాయకులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఆయా పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని కోరారు. తమవంతుగా సేవా కార్యక్రమాలను అలవాటు చేసుకోవడం ద్వారా భవిషత్తు తరాలకు ఉపయోగపడుతుందని సబితారెడ్డి పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement