Thursday, May 9, 2024

భూ సేకరణ పరిహారం విషయంలో వివక్ష.. నితిన్ గడ్కరీని క‌లిసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భూమి కోల్పోయినవారికి ఇచ్చే పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు పాల్పడుతోందని బీజేపీ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. భూయజమానులకు చెల్లించే పరిహారం విషయంలో కొందరికి ఒక విధానాన్ని, మరికొందరికి మరొక విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు.

భూమిని కోల్పోయినవారు మరోచోట తిరిగి భవనాలు నిర్మించుకుంటుంటే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వారిని అనేక రకాలుగా వేధిస్తున్నారని ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఓ వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. అలాగే ఈ ఎలివేటెడ్ కారిడార్ చాలాకాలంగా నిర్మాణంలో ఉందని, త్వరగా పనులు పూర్తయ్యే చూడాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. పరిహారంలో వివక్ష అంశాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సరిదిద్దేలా చర్యలు చేపడతామని గడ్కరీ హామీ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement