Sunday, April 28, 2024

Delhi | కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ.. శబరిమలలో ఏర్పాట్లకై వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: శబరిమలలో సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాసి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేక  ఇబ్బందులకు గురవుతున్న భక్తుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నారు.

గత కొద్ది రోజులుగా శబరిమల క్షేత్రంలో రద్దీని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో తొక్కిసలాట పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన తొక్కిసలాటలో ఓ బాలిక మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడి పరిస్థితులు, భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. అయినప్పటికీ కేరళ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఓసారి ముఖ్యమంత్రితో కిషన్ రెడ్డి నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పుడు లేఖ రాసి ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలో..

- Advertisement -

“అయ్యప్పస్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష ఆ తర్వాత.. శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటిమందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి మండలదీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుంది.

అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, చానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. ఇటీవలే.. శబరిమల అయ్యప్ప  సన్నిధానంలో దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగింది. శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో.. ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను.

శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయగలరని మనవిచేస్తున్నాను. అయ్యప్పస్వామి మండల దీక్షలో ఉన్న భక్తులకు శబరిమల యాత్ర సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించడం, వారి యాత్ర భక్తిప్రద్రంగా, శుభప్రదంగా జరిగేలా చూడడం అత్యంత అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం భక్తులకు సౌకర్యార్థం అందించేందుకు సిద్ధంగా ఉంది.

భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబా నది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థలను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో మీరు వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.” అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement