Wednesday, May 8, 2024

కార్పొరేట్ వ‌ల‌.. మీ పిల్ల‌ల‌ను మా కాలేజీలోనే చేర్పించండి..

పాపన్నపేట : ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు ఉన్నత భవిష్యత్‌ అందించేందుకు తపన పడుతుంటారు. ఎంత కష్టమైనా, ఖర్చయినా నాణ్యమైన విద్యనందించాలని కోరుకుంటారు. వారి ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. కార్పొరేట్‌ కళాశాలలు, ‘మా కాలేజీలో చేర్పిస్తే మీ పిల్లలు ఇలా.. అలా.. అవుతారు. అంటూ మభ్య పెడుతున్నారు. ఇప్పుడే అడ్మిషన్‌ తీసుకుంటే ఇంత శాతం తగ్గుతుందని ప్యాకేజీల పేరిట కోర్సుకో రేటు కడుతూ ఇంటి వద్దే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఇష్టమైన కోర్సు కాకుండా వారు చెప్పిన కోర్సులోనే జాయిన్‌ చేసి వారి భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలు ముగిశాయి. అప్పుడే లెక్చరర్లు, పీఆర్‌వోలు ఊళ్లపై వాలిపోతున్నారు.

కార్పొరేట్‌ కళాశాలలు ఏజెంట్లకు కమీషన్లు, వేతనాలు చెల్లిస్తుండడంతో వారు విద్యార్థులను చేర్పించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఎవరైనా తల్లిదండ్రులు ఫలితాలు రాకముందే ఎలా చేర్పించాలంటూ ప్రశ్నిస్తే (మీ పిల్లలు బాగానే చదువుతారని మాకు సమాచారం ఉందని, తప్పకుండా పాస్‌ అవుతారు’ అని చెప్పుకొస్తున్నారు. అవసరమైతే పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయుల నుంచి సైతం తల్లిదండ్రులకు మాట్లాడిస్తున్నారు. ఒకవేళ పాస్‌ కాకపోతే చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామంటూ హామీలిస్తున్నారు. ఇలా ఇంటర్‌ ఆడ్మిషన్లకు ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులు, ఆర్‌ఎంపీ డాక్టర్లను రంగంలోకి దించి ఒక్క విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే పదిశాతం డబ్బు ముట్టజెప్పేందుకు వీఆర్‌ వోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.

అప్రమత్తతే ముఖ్యం..
తల్లిదండ్రులు తొందరపడి పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కాలేజీల్లో చేరితే తర్వాత ఎవరూ పట్టించుకోరని పేర్కొంటున్నారు. ముందుగా విద్యార్థుల అభిప్రాయం, సదరు కళాశాలలో విద్య నాణ్యత, బోధన చేస్తున్న వారి అనుభవం అంశాలను కళాశాలకు చెందిన సీనియర్‌ విద్యార్థులను తెలుసుకున్న తర్వాతే ఆడ్మిషన్‌కు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది.

కట్టడి చేయాలి – సంతోష్‌ నాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మెదక్‌
కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాల అసత్య ప్రచారాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత డీఐఈవోదే. అక్రమ అడ్మిషన్ల దందాపై భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించి పోరాట కార్యక్రమాలు రూపొందిస్తాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement