Saturday, May 4, 2024

Delhi: గోరంట్లపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. ఏపీకి వచ్చి విచారణ జరపాల‌న్న బీజేపీ మహిళా మోర్చా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న హిందూపురం ఎంపీ (వైఎస్సార్సీపీ) గోరంట్ల మాధవ్‌పై జాతీయ మహిళా కమిషన్‌కు మరో ఫిర్యాదు అందింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిశోర్ నేతృత్వంలో నేతల బృందం బుధవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి మాధవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన నిర్మల కిశోర్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేరాల సంఖ్య పెరిగిందని ఆరోపించారు.

ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు విష సంస్కృతికి నాంది పలికారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌తో కలిపి ఇప్పటి వరకు మొత్తం నలుగురు వైఎస్సార్సీపీ నేతలు అసభ్యకర, అశ్లీల కార్యాకలాపాల్లో దొరికారని ఆమె అన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినవాళ్లే ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఉద్యోగులు తప్పు చేస్తే శిక్షించే ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చేస్తున్న తప్పులపై ఎందుకు శిక్షించడం లేదని ఆమె ప్రశ్నించారు. తప్పులు చేసే ప్రజాప్రతినిధులను సైతం శిక్షించాల్సిందేనని, ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. గోరంట్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ మహిళా కమిషన్ ఒక బృందాన్ని పంపించి మరీ విచారణ జరిపించాలని కోరినట్టు ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement