Wednesday, May 15, 2024

Follow up | రేషన్‌ డీలర్ల కమిషన్‌ 1400కు పెంపు..13 ప్రధాన అంశాలకు పరిష్కారం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రేషన్‌ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. డీలర్లకు ఇచ్చే కమిషన్‌ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మెట్రిక్‌ టన్నుకు ప్రస్థుతమున్న కమిషన్‌ను 200 రూపాయల నుండి 1400 రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227మంది రేషన్‌ డీలర్లకు లబ్దీ చేకూరనుంది.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 139 కోట్ల అధనపు భారం పడుతుందని అయినప్పటికీ అన్నివర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షించే సీఎం కేసీఆర్‌ రేషన్‌ డీలర్లను సైతం ఆదుకోవాలని ఆదేశించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కేవలం మెట్రిక్‌ టన్నుకు రూ.200 కమిషన్‌ను మాత్రమే డీలర్లకు చెల్లించేవారని, ప్రస్థుతం దానిని రూ.1400 రూపాయలకు పెంచామన్నారు. అతి తక్కువ సమయంలో రేషన్‌ డీలర్లకు 700 శాతం కమిషన్‌ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు.

ఈ మేరకు తెలంగాణ రేషన్‌ డీలర్ల సంఘాలతో సచివాలయంలో మంగళవారం మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావ్‌ గౌడ్‌, రేషన్‌ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, డీలర్ల జేఏసీ నేతల సమక్షంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం మంత్రులు హరీష్‌రావు, గంగుల మాట్లాడుతూ… దేశంలోని ఏరాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అధనంగాయ ఆహారధాన్యాలు ఇవ్వడం లేదని కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నామన్నారు.

ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తోందన్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అధనంగా కిలో బియ్యాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. తాజాగా రేషన్‌ డీలర్లకు కమిషన్‌ను సైతం పెంచామని తెలిపారు. రేషన్‌ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను పరిష్కరించామని తెలిపారు.

- Advertisement -

కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్‌ మంజూరు చేయడంతోపాటు రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడ బీమాల తరహాలో రేషన్‌ డీలర్లకు 5లక్షల బీమా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతీ డీలర్‌ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

రేషన్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్షిప్‌ రెన్యూవల్‌ను 5 ఏళ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్‌ డీలర్షిప్‌ వయోపరిమితిని 40 నుండి 50 ఏళ్లకు పెంపు, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం 10 వేలు, 1.5 క్వింటాళ్ల వేరియేషన్‌ను కేసుల పరిధినుండి తీసివేయడం, హైదరాబాద్లో రేషన్‌ భవన్‌ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందన్నారు.

కమిషన్‌ పెంపుతోపాటు ఇంకా అనేక సమస్యలను పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌కు రేషన్‌ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు- సివిల్‌ స్లపస్‌ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌, రేషన్‌ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్‌, రవీందర్‌, నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement