గ్రీన్ ఎనర్జీ సాధనే ఇండియా లక్ష్యమని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలియజేశారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సోమవారం ప్రసంగించారు. కాలుష్యం లేని గ్రీన్ హెడ్రోజన్, ప్రత్యామ్నాయ వనరుల ద్వారా బయో ఇంధనాల ఉత్పత్తికి ఇండియా కట్టుబడి ఉన్నదని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఇండియా అగ్రస్థానంలో నిలబడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్లో 20 శాతం ఎథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని 2030 నుంచి 2025కు కుదించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ లక్ష్యాన్ని తప్పకుండా సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని తాకినప్పుడే ఇండియా చాలా చురుకుగా వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాను కట్టడిచేసే వ్యాక్సిన్ తయారీని ఫాస్ట్ ట్రాక్ మీదికి తీసుకెళ్లిందని ఆయన వివరించారు. యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేసిందని ఆయన తెలియజేశారు. దేశానికి ఉన్న వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం 2004-2014 మధ్య సర్వనాశనమైందని ఆయన ఆరోపించారు. కరోనా బయటపడగానే దాని నివారణకు శరవేగంగా వ్యాక్సిన్ తయారు చేయాలని మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..