Monday, May 6, 2024

National : చిన్నారి ప్రాణం తీసిన కేక్‌…

పంజాబ్ రాష్ట్రం పాటియాలాలో ఓ కుటుంబంలో విషాదం నెల‌కొంది. పదేళ్ల చిన్నారి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేశారు. అంతేకాదు.. అందరూ సంతోషంగా రాత్రివేళ చిన్నారి బర్త్ డే వేడుకల్లో పాల్గొని చిన్నారికి కేక్ తినిపించారు. మురుసటి రోజు బాలికకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు మెరుగైన చికిత్స నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది.

చిన్నారి మృతికి కారణం ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసిన కేక్ అని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

చిన్నారి మరణానికి కొన్ని గంటల ముందు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చిన్నారి తన పుట్టినరోజును జరుపుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. వీడియోలో బాలిక క్షేమంగా కనిపించింది. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై మృతురాలి తాత మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో సాయంత్రం 6గంటలకు కేక్ ఆర్డర్ చేయగా.. 6.15 గంటలకు కేక్ వచ్చింది. 7.15గంటలక కేక్ కట్ చేశారు. అది తిన్నాక ఇంట్లో అందరి ఆరోగ్యం క్షీణించింది. తలలు తిరిగాయి. ఇద్దరు చిన్నారుల్లో ఒకరికి 10ఏళ్లు. పుట్టిన రోజు జరుపుకునే చిన్నారి పేరు మాన్వి. ఆమె చెల్లికి ఎనిమిదేళ్లు. కేక్ తినగానే ఇద్దరూ వాంతులు చేసుకున్నారు. మృతురాలి చెల్లికి బాగా వాంతి కావడంతో కేక మొత్తం బయటకు వచ్చేసింది. మాన్వికి కూడా వాంతులు అయ్యాయి.

మాన్వి కేక్ తిన్నతరువాత వాంతులు చేసుకొని పడుకుంది. మధ్యలో రెండు సార్లులేచి నీళ్లు కావాలని అడిగింది. గొంతు ఎండిపోతుంది.. చాలా దాహంగా ఉందని చెప్పింది. ఆ తరువాత మాన్వి నిద్ర పోయింది. అయితే, తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ఆమె వద్దకు వెళ్లి చూడగా.. తీవ్ర అస్వస్తతకు గురైనట్లు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. వైద్యులు ఆక్సిజన్ అందించారు. ఈసీజీ లు తీశారు. ఆమె చనిపోయిందని మృతురాలి తాత చెప్పారు. ఆన్ లైన్ కేక్ వల్లనే మాన్వి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement