Friday, April 26, 2024

బీఎస్‌ఈ లాభం రూ.71 కోట్లు.. రెండింతలు పెరిగిన ప్రాఫిట్‌

ముంబై : లీడింగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ బీఎస్‌ఈ బుధవారం 2022, మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. గతేడాది నాల్గో త్రైమాసికంతో పోలిస్తే.. నికర లాభాలు రెండింతలు పెరిగింది. రూ.71.52 కోట్ల లాభాలను గడించినట్టు బీఎస్‌ఈ ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో రూ.31.75 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుందని ఎన్‌ఎస్‌ఈ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బీఎస్‌ఈ ప్రస్తావించింది. ఇక రెవెన్యూ కూడా భారీగానే పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం క్యు4లో రూ.204.59 కోట్ల రెవెన్యూ గడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.152.18 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. మార్చి 2022 త్రైమాసికంలో బోనస్‌ షేర్ల ఈక్విటీ క్యాపిటల్‌ పోస్టు ఇష్యూపై 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రతీ ఈక్విటీ షేరుకు రూ.2 తుది డివిడెంట్‌ను ప్రకటించింది.

గతం కంటే ఎంతో మెరుగ్గు…

ఈ సందర్భంగా బీఎస్‌ఈ ఎక్స్చేంజ్‌ సీఈఓ, ఎండీ అశీష్‌ కుమార్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే.. బీఎస్‌ఈ అన్ని ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధి చెందడానికి వీలుగా కల్పించే విధంగా సంస్థలు, పెట్టుబడిదారుల కోసం ఉత్పత్తులు, మార్కెట్‌లను నిర్మించే వ్యూహంతో పని చేస్తోంది. దీంతో బీఎస్‌ఈ నిజంగా అన్ని ప్రతికూల, సానుకూల పరిస్థితులను వృద్ధి అవకాశాలుగా మలుచుకోగలిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభించినప్పుడు.. అసెట్‌ క్లాస్‌లలో సంభవించే ట్రెండ్‌లను ఉపయోగించుకోవడానికి తాము గతంలో కంటే మెరుగ్గా ఉన్నామన్నారు. తమ ముందు ఉన్న అనేక వృద్ధి అవకాశాలపై పెట్టుబడిపెట్టడం, అమలు చేయడంపై తాము దృష్టి సారించామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి.. బోర్స్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. రూ.141.7 కోట్ల నుంచి.. 73 శాతం పెరిగి.. రూ.244.93 కోట్లకు చేరుకుందన్నారు. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 48 శాతం పెరిగి.. రూ.743.15 కోట్లకు చేరుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement