ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 400అడుగుల లోతు బోరు బావిలో పడిపోయాడు. కాగా మట్టి కూరుకుపోవడంతో 30 అడుగుల లోతులో ఉన్న బండరాయిపై ఇరుక్కుపోయాడు. తల్లిదండ్రులు కొడుకు జస్వంత్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చివరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో బోరు బావిలో నుంచి జస్వంత్ కేకలు వేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. స్థానికులు వెంటనే తాళ్ల సహాయంతో బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. దాదాపు 5 గంటలకు పైగా జస్వంత్ బోరు బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు.
నడుం భాగానికి తాడు కట్టుకుని బోరుబావిలోకి సురేష్ అనే యువకుడు దిగాడు. జస్వంత్ను పట్టుకోగానే స్థానికులు పైగి లాగారు. బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోరు బావి ప్రమాదం నుంచి ప్రాణాలతో బాలుడు బయటపడటంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. బాలుడ్ని కాపాడటంలో ధైర్యం చేసి బోరుబావిలోకి దిగిన యువకుడు సురేష్ను గుండు గోలనుగుంట వాసులు అభినందించారు. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.సురేష్ అనే యువకుడిని స్థానికులు, పోలీసులు అభినందించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండు గోలనుగుంటలో ఈ సంఘటన చోటుచేసుకున్నది.