Tuesday, April 30, 2024

భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు.. టీకా విజయవంతమైందని ప్రకటన

కరోనా నుంచి రక్షణ కోసం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన నాసల్‌ వ్యాక్సిన్‌ బీబీవీ154 ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది పూర్తిగా సురక్షితమైందని, వ్యాధి నిరోధక వక్తిని సమర్ధవంతంగా ప్రేరేపిస్తుందని ప్రకటించింది. ఈ చుక్కల మందును సెయింట్‌ లూయిస్‌ లోని వాషింగ్టన్‌ యూనివర్శిటీ భాగస్వామ్యంతో ప్రతేకంగా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను ముక్కు రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయోగ ఫలితాలను ఔషధ నియంత్రణ సంస్థలకు తెలిపినట్లు కంపెనీ వెల్లడించింది.

పేద, మధ్యతరగతి దేశాలకు తక్కువ ధరకే అందించాలన్న లక్ష్యంతో నాసల్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసినట్లు భారత్‌ బయోటెక్‌ కంపెనీ తెలిపింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సాయంతో ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించింది. బీబీవీ154 టీకాను ప్రాథమిక డోస్‌గా, బూస్టర్‌ డోస్‌గా వినియోగించడంపై వేర్వేరుగా ప్రయోగాలు నిర్వహించారు. ఈ టీకాను 2-8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద భద్రపరిచి సులభంగా రవాణా చేయవచ్చని కంపెనీ తెలిపింది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజున బీబీవీ154 టీకా విజయవంతమైందని ప్రకటించడం గర్వకారణంగా ఉందని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement