Sunday, May 19, 2024

జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచాలి.. కేంద్రమంత్రులతో బీసీ నేతల చర్చలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జనాభా ప్రాతిపదికన వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఈమేరకు రాజ్యాంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సంఘం అధ్యక్షులు వరప్రసాద్, ఇతర బీసీ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి చర్చలు జరిపారు. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం మాత్రమే ఉన్న రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని వారు కేంద్రమంత్రిని కోరారు.

ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారన్నకృష్ణయ్య, బీసీలకు అలా రిజర్వేషన్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దశాబ్దాలుగా బీసీలకు ఉద్యోగాలు, పదవులు, పథకాల్లో అవకాశాలు కోల్పోతున్నారని, వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. బీసీల అభివృద్ధికి కేంద్రం రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2 లక్షల 70 వేల బీసీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కృష్ణయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement