Friday, May 3, 2024

బ్రాండ్‌ ఇండియాకు ఏవీజీసీ కీలకం.. ఏటా 1.60లక్షల ఉద్యోగాలు, 25-30 వార్షిక వృద్ధి

క్రియేట్‌ ఇన్‌ ఇండియా, బ్రాండ్‌ ఇండియా అభివృద్ధిలో భారతదేశ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ ్స, గేమింగ్‌, కామిక్‌ (ఏవీజీసీ) రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. దాదాపు 25-30 శాతం వార్షిక వృద్ధి కలిగి.. ఏటా 1,60,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నదని తెలిపింది. ఏవీజీసీ రంగం.. 2025 నాటికి ప్రపంచ మార్కెట్‌ వాటాల్‌ 5 శాతం (40 బిలియన్‌ డాలర్లు) స్వాధీనం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది. ఏవీజీసీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు మరింత విస్తరించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపింది. ఏవీజీసీ ప్రమోషన్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని 2022-23 బడ్జెట్‌లోనే ప్రకటించినట్టు గుర్తు చేసింది. ప్రకటనకు అనుగుణంగా.. ఏవీజీసీ ప్రమోషన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. దీనికి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారన్నారు.
టాస్క్ ఫోర్స్‌ లక్ష్యం
సంబంధిత పరిశ్రమ వర్గానికి చెందిన బీరెన్‌ ఘోష్‌, ఆశిష్‌ కులకర్ణి, జేష్‌ కృష్ణమూర్తి, చైతన్య చించ్లికర్‌, కీతన్‌ యాదవ్‌, కిశోర్‌ కిచిలి, నీరజ్‌ రాయ్‌లు సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ వంటి విద్యా సంస్థల అధిపతులు, ఎంఈఎస్సీ, ఫిక్కీ, సీఐఐ లాంటి పరిశ్రమ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. జాతీయ ఏవీజీసీ విధానాన్ని ప్రకటించడం, సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, డాక్టోరల్‌ కోర్సులు ఏర్పాటు చేయడం టాస్క్‌ఫోర్స్‌ ప్రధాన విధి విధానాలు. ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు విద్యా సంస్థలు, వృత్తి శిక్షణ కేంద్రాలు, పరిశ్రమల సహకారంతో నైపుణ్య కార్యక్రమాలు అమలు చేయడం టాస్క్‌ఫోర్స్‌ లక్ష్యం. ఏవీజీసీ ప్రమోషన్‌ టాస్క్‌ఫోర్స్‌ తన మొదటి కార్యాచరణ ప్రణాళికను 90 రోజుల్లోపు అందజేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement