Tuesday, May 7, 2024

మూడు గ్రామాలుగా భద్రాచలం.. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం…

  • భద్రాచలం , సీతారాం నగర్, శాంతి నగర్‌ నూతన గ్రామాలుగా ఆవిర్భావం
  • ఆసిఫాబాద్ లో రాజంపేట నూతన గ్రామంగా ఏర్పాటు
  • హైకోర్టు ఆదేశం మేరకే మున్సిపాలిటీ కాకుండా మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం వికేంద్రీకరణ
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ : భద్రాచలంను మూడు కొత్త గ్రామాలుగా వికేంద్రీకరణ చేస్తూ, ఆసిఫాబాద్ లో రాజం పేట నూతన గ్రామంగా ఏర్పాటు చేస్తూ నిన్న శాసన సభలో, నేడు శాసన మండలిలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశ పెట్టిన పంచాయతీ రాజ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. భద్రాచలంను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ… ఏజెన్సీ ఏరియా కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు భద్రాచలంను మున్సిపాలిటీగా కాకుండా మూడు గ్రామ పంచాయతీలుగా వికేంద్రీకరణ చేయాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు.

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 షెడ్యూల్ 8ని సవరించడానికి బిల్లు వివరాలు…
ఈ బిల్లు భద్రాచలం, సారపాక, ఆసిఫాబాద్‌లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి సంబంధించినది. తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019 లో ‘లేదా’ తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం, 2018 లో గానీ ప్రస్తుతం ఈ గ్రామాలలో ఎన్నుకోబడిన సంఘాలు లేవు. పైన పేర్కొన్న మూడు గ్రామాలను మున్సిపాలిటీలుగా నోటిఫై చేయాలని గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదించింది. అయితే, భారత రాజ్యాంగంలోని పార్ట్ 9A లోని ఆర్టికల్ 243-ZC (3) లో సూచించిన విధంగా పార్లమెంటు షెడ్యూల్డ్ ప్రాంతాలను విస్తరించే వరకు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో మునిసిపాలిటీలు సాధ్యం కాదు. భద్రాచలంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర చర్యను సవాలు చేస్తూ హైకోర్టులో కొంతమంది పిల్ దాఖలు చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ప్రకారం, కొమరంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కలెక్టర్లు ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాకలను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించారు. భద్రాచలం ఏజెన్సీ గ్రామం 50 వేల 87 జనాభాతో 2 వేల 47 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది, గిరిజన జనాభా 4 వేల 680. పరిపాలనా వికేంద్రీకరణచ సమర్థవంతమైన పాలన కోసం, భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా (1) భద్రాచలం (2) సీతారాం నగర్ మరియు (3) శాంతి నగర్‌ గా భద్రాచలం మండలం, భద్రాచలం జిల్లా గా ఏర్పాటు చేయాలి. సారపాక గ్రామం ITC కంపెనీతో పాటు ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉంది మరియు వలస జనాభా అధికంగా ఉంది. భౌగోళిక ప్రాంతం 4 వేల 244ఎకరాలు.. 20 వేల 168 జనాభా, గిరిజన జనాభా 2 వేల 202. ఇది 32 వార్డులను కలిగి ఉంది, ఇది గోదావరి నదిని కలిగి, శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయానికి ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది. అందుకే సారపాక గ్రామ పంచాయతీ రెండు గ్రామ పంచాయతీలుగా (1) సారపాక మరియు (2) ITC గ్రామాలుగా బూర్గంపహాడ్‌ మండలం, భద్రాద్రి కొత్తగూడం జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కేంద్రంగా ఆసిఫాబాద్, జనకపూర్ , రాజంపేట & గొడవెల్లి అనే నాలుగు రెవెన్యూ గ్రామాలను కలిగి ఉంది. రాజంపేట గ్రామం కుమ్రంభీంలోని ఏజెన్సీ గ్రామం. ఈ గ్రామం చాలా తక్కువ విస్తిర్ణం కలిగి ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 185 ఎకరాల విస్తిర్ణం మరియు జనాభా 1 వెయ్యి 794 ఉంది. ప్రస్తుత అంచనా జనాభా 1 వెయ్యి 973. కావునా రాజంపేటను ప్రత్యేక గ్రామంగా మార్చడం చాలా ముఖ్యమైనది. తదనుగుణంగా మంత్రి మండలి ముందు ఈ ప్రతిపాదన ఉంచబడింది. తెలంగాణ షెడ్యూల్ 8 కి సవరణ చేయడం ద్వారా భద్రాచలం, సారపాక మరియు రాజంపేట ఏజెన్సీ గ్రామాలని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేయడానికి మంత్రి మండలి తీర్మానాన్ని ఆమోదించింది. కావున పంచాయతీ రాజ్ చట్టం, 2018, షెడ్యూల్ 8 కి సవరణ చేయడానికి శాసనసభ, శాసనమండలి ముందు బిల్లును ఉంచనైనది. తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం, 2018, సెక్షన్ 3 (2) ప్రకారం “రాష్ట్ర శాసనసభ ఈ చట్టానికి సవరణ ద్వారా, ఈ చట్టం యొక్క షెడ్యూల్ 8 ని సవరించవచ్చు లేదా జోడించవచ్చు లేదా మార్చవచ్చు. ” ఏదైనా గ్రామం నుండి స్థానిక ప్రాంతాన్ని వేరు చేయడం ద్వారా లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రామాలు లేదా గ్రామాల భాగాలను కలపడం ద్వారా లేదా ఏదైనా స్థానిక ప్రాంతాన్ని ఏదైనా గ్రామంలోని ఒక భాగానికి కలపడం ద్వారా కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేయవచ్చు. దీని ప్రకారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 (సెక్షన్ నం.5) షెడ్యూల్ 8 ని సవరించడం ద్వారా ఎగువ గ్రామాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బిల్ ఆమోదం పొందడం పట్ల మండలి చైర్మన్, సభ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement