Monday, April 29, 2024

ISRO : గ‌గ‌న్ యాన్ వ్యోమగాములు రెడీ…పేర్లు ప్ర‌క‌టించిన ప్ర‌ధాని…

తిరువనంతపురం: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. 2025 లో భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వారు ఘనత దక్కించుకోనున్నారు.

నాలుగు పేర్లు కాదు… 140 కోట్ల భార‌తీయుల ఆకాంక్ష‌లు..

- Advertisement -

కేరళలోని తిరువనంతపురంలో నేడు జరిగిన కార్యక్రమంలో ప్రధాని వారిని పరిచయం చేస్తూ.. వ్యోమ‌గాముల‌ను స్టాండింగ్ ఒవేషన్‌తో సత్కరించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ , ‘విక్రమ్ సారాభాయ్‌ స్పేస్ సెంటర్ నుంచి మరొక చరిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నామ‌ని అన్నారు.. ఈ రోజు నలుగురు వ్యోమగాములు భారత్‌కు పరిచయం చేశాన‌ని చెప్పారు… ఇవి నాలుగు పేర్లు కాద‌ని, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తుల‌ని అన్నారు.

కౌండ్ డౌన్ మ‌న‌దే… రాకెట్ మ‌న‌దే…

40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడ‌ని అంటూ అయితే ఈసారి కౌంట్‌డౌన్‌ మనదే. రాకెట్ మనదే’ అంటూ ప్రధాని వివ‌రించారు. గతంలో రాకేశ్‌శర్మ భారత్‌ తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించార‌ని, అయితే ఆయన రష్యా ప్రయోగకేంద్రం నుంచి వెళ్లిన నౌకలో ఈ ఘనత అందుకున్నార‌ని చెప్పారు. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతున్న తరుణంలో గగన్‌యాన్‌ మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుందని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో భారత నారీ శక్తి కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్‌, గగన్‌యాన్‌ వంటి మిషన్‌లను ఊహించుకోలేమని తెలిపారు. ఈ వ్యోమగాముల బృందం కొద్దికాలం రష్యాలో శిక్షణ పొందార‌న్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ వారిని సుశిక్షితులను చేసింద‌ని చెప్పారు. . ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంద‌న్నారు.

మూడు రోజుల మిష‌న్ …2025 లో ప్ర‌యోగం ..

ఇస్రో ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్ మాట్లాడుతూ, 2025లో జరిగే ఈ యాత్ర కోసం సుశిక్షితులైన మ‌న వ్యోమ‌గాములు నిరీక్షిస్తున్నారని చెప్పారు. వారిని రోదసిలోకి పంపి, మూడు రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ యాత్రలో కీలకాంశమని తెలిపారు. ఈ మిషన్ సాంతం వారు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చామ‌ని చెప్పారు. అలాగే సాంకేతిక విభాగాల్లోనూ పట్టు కూడా వారు సాధించార‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement