Tuesday, May 7, 2024

రాజధాని విషయంలో ఎంపీలకు లేఖ రాసిన అమరావతి జేఏసీ

త్వరలో ఏపీ రాజధాని విశాఖకు తరలిపోతుందన్న ఏపీ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతి జేఏసీ నేతలు పార్లమెంటు సభ్యులందరికీ లేఖలు రాశారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకు మద్దతు తెలపాలని కోరుతూ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి, కన్వీనర్ కె.శివారెడ్డి ఏడు పేజీల లేఖ రాశారు. రాజధానిగా అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేసిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.

2014లో పార్లమెంటు ఆమోదించిన పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఒకే రాజధాని ఉండాలని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లును శాసనమండలి తిరస్కరించడంతో జీర్ణించుకోలేని ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ బిల్లును ఆమోదించిందని పేర్కొన్నారు. రాజధాని ఎంపికలో తమ పాత్రేమీ లేదన్న కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టులో గతేడాది ప్రమాణపత్రం దాఖలు చేసిందని గుర్తు చేశారు. నిజానికి రాష్ట్ర రాజధాని మార్పు, పేరు మార్పు అధికారం పార్లమెంటుకు ఉంటుందని, కాబట్టి కేంద్ర హోంశాఖ సమర్పించిన ప్రమాణపత్రం రాజ్యాంగ విరుద్ధమని జేఏసీ నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: మన్సాస్‌లో 16 ఏళ్ల ఆడిట్

Advertisement

తాజా వార్తలు

Advertisement