బ్యాంకాక్: మియన్మార్లో సైన్యం దురాగతాలకు అడ్డే లేకుండా పోతోంది. సైనిక పాలనను వ్యతిరేకించే వర్గం ఓ గ్రామంలో చేపట్టిన కార్యక్రమమే లక్ష్యంగా తాజాగా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పలువురు చిన్నారులు, మహిళలు సహా 100 మంది మరణించినట్లు ప్రజాస్వామ్య అనుకూల గ్రూప్, స్వతంత్ర మీడియా తెలిపాయి.
ఫిబ్రవరి 2021లో సైన్యం ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి అధికారాన్ని లాక్కున్నప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. అప్పటి నుంచి భద్రతా బలగాలు 3వేల మంది పౌరులను పొట్టనపెట్టుకున్నట్లు ఓ అంచనా. మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలోని పజిగ్గీ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం మంగళవారం ఉదయం స్థానిక కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేసింది. సుమారు 150 మంది ఈ వేడుకకు హాజరయ్యారు. సరిగ్గా ఆ సమయంలో సైన్యం వైమానిక దాడులు చేసింది. దీంతో అక్కడకు వచ్చిన వారిలో వంద మందికి పైగా బలయ్యారు..పౌరులపై దాడి పట్ల అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది.