Wednesday, May 1, 2024

Big Story | దేశాన్ని వదిలేసిన 6,500 మంది మిలియనీర్లు

మన దేశం నుంచి కుబేరులు బయట దేశాలకు వలసపోతున్నారు. 2023వ సంవత్సరంలో మన దేశం నుంచి ఇలా 6,500 మంది మిలియనీర్లు దేశాన్ని వదిలేశారు. అంతకు ముందు సంవత్సరం మన దేశం నుంచి 7,500 మంది విదేశాల్లో స్థిరపడ్డారు. హెన్లీ ప్రైవేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రిపోర్ట్‌ 2023లో ప్రపంచ వ్యాప్తంగా మైగ్రేషన్‌ తీరుతెన్నులను వివరించింది. ఈ నివేదిక ప్రకారం 10 లక్షల డాలర్ల సంపద ఉన్నవారిని మిలియనీర్ల జాబితాలో పేర్కొంటున్నారు.

ఇలా అధిక సంపద కలిగి వ్యక్తులు దేశాన్ని వదిలిపోతున్న వారి సంఖ్య రీత్యా మన దేశం రెండో స్థానంలో ఉంది. ఈ విషయంలో చైనా 13,500 మంది వలసతో మొదటి స్థానంలోఉంది. బ్రిటన్‌ నుంచి 3,200 మంది, రష్యా నుంచి 3 వేల మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఇలా మన దేశం నుంచి పెద్ద సంఖ్యలో కుబేరులు వలస వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. దేశంలో నెలకొంటున్న గందరగోళ పరిస్థితులు, రక్షణ, భద్రత, విద్య, వైద్యం, వాతావారణంలో తరచుగా మార్పులు, క్రిఎ్టో కరెన్సీకి సానుకూలత వంటి కారణాలతో వీరు విదేశాల్లో స్థిరపడేందుకు కుటుంబాలను తరలిస్తున్నారు.

- Advertisement -

ఆఫర్లు ఇస్తున్న దేశాలు

ఇలా ఎక్కువ మంది వెళ్తుతున్న టాప్‌ 10 దేశాల్లో 9 దేశాలు పెట్టుబడి ప్రోగ్రామ్‌ల ద్వారా అధికారిక నివాసాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. కొన్నిదేశాలు పెట్టుబడి పెట్టేదాన్ని బటి పౌరసత్వాన్ని కూడా ఇస్తున్నాయని నివేదిక తెలిపింది. ప్రధానంగా ఇలాంటి వారు తమ పెట్టుబడులు స్థానిక, గ్లోబల్‌ అస్థిరతలకు లోను కాని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ పెట్టుబడులను వైవిధ ్యపరచడంలో స్పష్టమైన విలువను వీరు గుర్తిస్తున్నారని హెన్లీ అండ్‌ పార్టనర్స్‌లోని ప్రైవేట్‌ క్లయింట్‌ గ్రూప్‌హెడ్‌ డొమినిక్‌ వోలెక్‌ అభిప్రాయపడ్డారు.

ప్రధానంగా మన దేశం నుంచి ఎక్కువ మంది బయటకు వెళ్లడానికి దేశంలోఉన్న పన్నుల చట్టాలు, బయట నుంచి రెమిటెన్స్‌కు సంబంధించి సంక్లిష్టమైన నియమాలు, కొన్ని సందర్బాల్లో తప్పుగా చిత్రీకరణ వంటి ప్రధాన కారణాలు కారమణమని నివేదిక పేర్కొంది. మన దేశానికి చెందిన వారిలో ఎక్కువ మంది దుబాయ్‌, సింగపూర్‌లో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా బయటకు పోతున్న వారిలో ఎక్కువ మంది ఇక్కడే స్థిరపడుతున్నారు. దుబాయ్‌ ప్రభుత్వం ఇన్వెస్టర్లకు గోల్డెన్‌ వీసా సదుపాయం కల్పిస్తోంది. ఆకర్షణీయమైన ప్రభుత్వ విధానాలు, సానుకూలమైన పన్నుల విధానం, బిజినెస్‌ పెరిగేందుకు అత్యంత అనువైన వాతావరణ, విధానాలు, సురక్షితమైన, ప్రశాంతమైన ప్రాంతాలుగా ఉండటం ముఖ్యమైన ఆకర్షణలని నివేదిక పేర్కొంది.

ఆందోళనకర పరిస్థితికాదు..

ఇలా దేశం నుంచి భారీ సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు వలస పోవడం పెద్దగా ఆందోళనకర అంశం కాదని నివేదిక తెలిపింది. భారత్‌కు భారీగా మిలియనీర్లు తయారు చేసే శక్తిసామర్ధ్యాలు ఉన్నాయని పేర్కొంది. 2031 నాటికి భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 80 శాతం పెరుగుతుందని పేర్కొంది. దీనితో పోల్చితే బయటకు పోతున్న వారి సంఖ్య అంత ఆందోళన కలిగించదని తెలిపింది. ఈ కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా సంపదను సృష్టించగలిగే దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంటుందని తెలిపింది. దేశంలో సంపద పెరిగేందుకు ప్రధానంగా ఫౖౖెనాన్షియల్‌ సెక్టర్‌, హెల్త్‌కేర్‌, టెక్నాలజీ రంగాలు దోహదం చేస్తాయని తెలిపింది.
భారత్‌కు తిరిగి వస్తున్న సంపన్నుల గురించి కూడా నివేదిక ఆసక్తికర అంశాలను పేర్కొంది. దేశంలో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గతంలో దేశం విడిచి వెళ్లిన వారిలో తిరిగి పెద్ద సంఖ్యలోనే తిరిగి వస్తున్నారని పేర్కొంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం భారత్‌లో 3,57,000 మంది కుబేరులు ఉన్నారు. భారత్‌తోపాటు ఆసియాలోని చాలా దేశాల్లో ధనవంతుల సంఖ్య ఎక్కువగానే ఉందని పేర్కొంది. 2023లో ఇప్పటి వరకు బయట దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న మిలియనీర్లు భారీగా ఏజెన్సీలను సంప్రదించారని తెలిపింది. 2022లో ఇలా వెళ్లిన వారి సంఖ్యతో పోల్చితే ఇప్పటికే 2023లో వీరి సంఖ్య 72.2 శాతానికి చేరినట్లు తెలిపింది. ఈ సంఖ్య ఈ సంవత్సరం ఇంకా భారీగా పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా ఇండియన్స్‌ ప్రత్యామ్నాయ నివాస ప్రాంతాలు, పౌరసత్వం గురించి ఎక్కువగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపింది.

2023లో పోర్చుగల్‌ దేశం ఆఫర్‌ చేస్తున్న గోల్డెన్‌ రెసిడెన్స్‌ పర్మిట్‌ ప్రోగ్రామ్‌ ఎక్కువ పాపులర్‌ అవుతున్నదని నివేదిక తెలిపింది. పెట్టుబడితో ఆస్ట్రేలియా ఆఫర్‌ చేస్తున్న పౌరసత్వం కూడా ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు తెలిపింది. కెనడా ఆఫర్‌ చేస్తున్న స్టార్టప్‌ వీసా కార్యక్రమం కూడా ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇక్కడ స్వేచ్ఛాగా బిజినెస్‌ చేసుకునే అవకాశంతో పాటు నార్త్‌ అమెరికా మార్కెట్‌లోకి తేలిగ్గా ప్రవేశించే అవకాశం ఉండటం వల్ల ఎక్కువ మంది కెనడాను కూడా ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఇటలీలో పెట్టుబడితో రెసిడెన్షి సదుపాయం, గ్రీస్‌ గోల్డెన్‌ వీసా, స్పెయిన్‌ పెట్టుబడితో రెసిడెన్షి ప్రోగ్రామ్‌ కూడా ఎక్కువ మంది మిలియనీర్లును ఆకర్షిస్తున్నాయి.

మిలియనీర్ల వలసతో చైనా ఎక్కువగా నష్టపోతున్నదని నివేదిక తెలిపింది. చైనా దేశం వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, అక్కడ వ్యక్తిగత మిలియనీర్ల సంఖ్య పెరుగుదల తక్కువగా ఉంది. డాలర్ల సంపదలో మిలియనీర్లు అయినవారిలో చాలా మంది ఆ దేశం విడిచిపోతున్నారు. బ్రిటన్‌ నుంచి కూడా వలసలు పెరుగుతున్నాయి. ప్రధానంగా బ్రెక్సిట్‌ నుంచి బ్రిటన్‌ బయటకు రావడంతో మిలియనీర్లు దేశం విడిచిపోవడం పెరిగిందని పేర్కొంది. అంతకు ముందు బ్రిటన్‌కు రావడమే తప్ప బయటకు వెళ్లడంలేదని తెలిపింది. 2016లో బ్రిటన్‌ బ్రెక్సిట్‌పై రిఫరెండం నిర్వహించి, ఆ కూటమిని నుంచి బయటకు వచ్చింది.
అమెరికాలోనూ పన్నులు పెరగడంతో మిలియనీర్ల వలసలు పెరిగాయని నివేదిక తెలిపింది. 2023లో ఇప్పటి వరకు అమెరికా నుంచి 2,100 మంది దేశం విడిచి వెళ్లారు.

ఆస్ట్రేలియాకే ఎక్కువ…

వివిధ దేశాల నుంచి వలస పోతున్నవారిలో ఎక్కువ మంది ఆస్ట్రేలియాలో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2023లో ఈ నివేదిక ప్రకారం 5,200 మంది మిలియనీర్లు ఆస్ట్రేలియాలో స్థిరపడేందుకు వచ్చారు. దీంతో ఇప్పటి వరకు వలసలను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉన్న యూనిటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రెండో స్థానంలోకి వచ్చింది. యూఏఈలో 4,500 మంది స్థిరపడ్డారు. మూడో స్థానంలో ఉన్న సింగపూర్‌కు వివిధ దేశాల నుంచి 3,200 మంది వలస వచ్చారు. స్విట్జర్లాండ్‌కు 1,800, కెనడాకు 16,00, గ్రీస్‌కు 1200, ఫ్రాన్స్‌కు 100 మంది పోర్చుగల్‌కు 800 మంది, న్యూజిల్యాండ్‌కు 700 మంది వలస వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement