Sunday, April 28, 2024

3,038 కొత్త కేసులు, 9 మరణాలు.. విజృంభిస్తున్న వైరస్‌

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64,740 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా, 3,038 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసు సంఖ్య 4,47,29,284కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,179 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,77,204 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో తొమ్మిది మంది మరణించారు.

మహారాష్ట్రలో నలుగురు మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,901 కి చేరింది. ఇప్పటి వరకు 22.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేయబడ్డాయి. మహారాష్ట్రలో ఒకేరోజు 711 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. వారం వ్యవధిలో 11 మంది మరణించారు. ముంబైలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 162కి పెరిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం సోలాపూర్‌, సాంగ్లి, కొల్హాపూర్‌, సింధుదుర్గ్‌, పుణ, సతారా జిల్లాల్లోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

గెహ్లాట్‌, వసుంధర రాజెకు పాజిటివ్‌

ఇదిలావుండగా రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, మాజీ సీఎం వసుంధర రాజెలు కొవిడ్‌ బారినపడ్డారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, తానూ వైరస్‌ బారినపడ్డానని గెహ్లాట్‌ వెల్లడించారు. కొద్దిరోజులు ఇంటినుంచే సేవలు అందిస్తానని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ట్వీట్‌చేశారు. వసుంధర రాజె సైతం తాను కరోనా బారినపడినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు ట్విటర్‌ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement