Friday, May 3, 2024

నాలుగేళ్ల చిన్నారిపై రేప్​.. దోషిగా తేలడంతో 20 ఏళ్ల జైలు శిక్ష

భూపాలపల్లి, ప్రభన్యూస్‌ ప్రతినిధి: జయశంకర్‌ జిల్లా అడవి ముత్తారం మండల పరిధికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రాస కొమురయ్యకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 1000 జరిమానా విధిస్తూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సెషన్స్‌ జడ్జి నారాయణ బాబు శుక్రవారం తీర్పు వెలువడించారు. కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి. నేరస్థుడు రాస కొమురయ్య(36) నాగారం గ్రామం, భూపాలపల్లి మండల వాసి. 2019 డిసెంబర్‌ 31 రాత్రి, అడవి ముత్తారం మండల పరిధిలోని ఓ గ్రామంలోని ఇంట్లోకి రాత్రిపూట అక్రమంగా చొరబడి అక్కడ నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని, గ్రామ శివారులోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు, అడవి ముత్తారం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌ అత్యాచార ఘటనపై విచారణ చేపట్టి చార్జిషీట్‌ ఫైల్‌ చేశారు. గత కొంతకాలంగా రేప్‌ కేసులో కొమరయ్యను కోర్టు విచారించి, వాదోపవాదనలు విన్న తర్వాత రాస కొమురయ్యను దోషిగా నిర్ధారిస్తూ, 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి నారాయణ బాబు తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్షపడే విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గోగికార్‌ శివరాజును, సమగ్ర దర్యాప్తు చేపట్టిన అప్పటి కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌ను, కోర్టు ట్రయల్‌ను నడిపించిన కాటారం సీఐ రంజిత్‌ రావును, అడవి ముత్తారం ఎస్సై రమేష్‌ను, సాక్షులను ప్రవేశపెట్టిన ఏఎస్‌ఐ వెంకన్న, హెడ్‌ కానిస్టేబుల్‌ భూమయ్యలను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్‌ రెడ్డి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement