Tuesday, May 7, 2024

11వేల సభలు, సమావేశాలు.. తెలంగాణలో బీజేపీ కార్యాచరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కార్పెట్ బాంబింగ్.. ఈ మాటను సాధారణంగా యుద్ధంలో ఉపయోగిస్తుంటాం. శత్రు దేశంపై ఆకాశం నుంచి వరుస పెట్టి బాంబుల జారవిడచి విధ్వంసం సృష్టించడాన్ని కార్పెట్ బాంబింగ్ అంటాం. ఇప్పుడు ఆ పదం రాజకీయాల్లోనూ వినియోగించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో తమ పట్టు పెంచుకోవాలని చూస్తున్న కమలనాథులు, కర్నాటక తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ క్రమంలో ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. 119 నియోజకవర్గాల తెలంగాణలో ఏకంగా 9 వేల శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణం ఉండేలా చర్యలు చేపట్టిన కాషాయదళం, ప్రతి 5-6 బూత్‌ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉండేలా ఇతర రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశారు. అయితే తెలంగాణ విషయానికొచ్చేసరికి ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.

ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖ్‌ను నియమించి, బూత్ స్థాయిలో ఎలక్షన్ ఇంజనీరింగ్ మొదలుపెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. కేవలం పట్టణ ప్రాంతాల్లో, అందులోనూ ముస్లిం జనాభా ఉన్నచోట మాత్రమే బీజేపీకి క్యాడర్ ఉందని ప్రత్యర్థులు భావిస్తున్న వేళ, ఊహకందని రీతిలో పార్టీ నిర్మాణాన్ని గ్రామగ్రామానికి, వాడవాడకు విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి నుంచి ప్రతి రోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రారంభ మాసం ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేస్తోంది.

- Advertisement -

ఇక చేరికలు షురూ

మరోవైపు నేతల కొరతను అధిగమించేందుకు ఇతర పార్టీల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే అంతర్గత సమస్యలు, విబేధాలు, వర్గపోరు కారణంగా కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు పలువురు బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అధికార బీఆర్ఎస్ నేతల విషయంలో మాత్రం బీజేపీ నాయకత్వం విముఖత ప్రదర్శిస్తోంది. అందుక్కారణం ఫాంహౌజ్ కేసు కాదని, బీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని, వారిని తీసుకుంటే ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఒకవేళ అక్కడ ఏ పదవిలోనూ లేని పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి ప్రజాబలం కలిగిన నేతల విషయంలో వ్యతిరేకత ప్రభావం ఉండదని చెబుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రజల్లో సానుభూతి ఉంటుందని, వారిని చేర్చుకుంటే పార్టీ ఓటుకు తోడు నేతల సొంత బలం కలిసి విజయం సాధించవచ్చని లెక్కలు వేస్తోంది. అందుకే బీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల నుంచి నేతలకు ఆహ్వానం పలుకుతోంది. అలాగని వస్తానని చెప్పే ప్రతి ఒక్కరినీ చేర్చుకునేందుకు కూడా బీజేపీ సిద్ధంగా లేదు. వారి నేపథ్యం వివాదాస్పదం కాకుండా ఉంటేనే చేర్చుకుంటామని స్పష్టం చేస్తోంది.

ఉత్తరాయణంలో మార్పులు, చేర్పులు

ఉత్తరాయణ కాలాన్ని శుభప్రదమని భావించే బీజేపీ నేతలు, మకర సంక్రమణం జరిగిన వెంటనే అటు కేంద్ర మంత్రివర్గంలో, ఇటు పార్టీలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టేందుకు కసరత్తు చేపట్టింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పార్టీ జాతీయ నాయకత్వంలో మార్పులు, చేర్పులు ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు మంత్రులు, సహాయ మంత్రులకు ఉద్వాసన పలికి, కొత్తగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ఎంపీలకు కేబినెట్‌లో చోటుకల్పించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తెలంగాణలో అధికారం సాధించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 12 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కొద్ది రోజుల్లో పదవీకాలం ముగుస్తున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు మరో విడత అధ్యక్షుడిగా కొనసాగించకపోతే, అధ్యక్ష పదవిని ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారికి ఇస్తారనే చర్చ జరుగుతోంది.

బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు తర్వాత పార్టీకి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరూ సారథ్యం వహించలేదు. ఇలా పార్టీలో, కేబినెట్‌లో జరిగే మార్పుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. గత విస్తరణ సమయంలోనే అందుబాటులో ఉండాల్సిందిగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు సూచించిన అధిష్టానం, ఈసారి ఆదివాసీ-గిరిజన సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బెర్త్ ఖరారు చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఇప్పటికే రాష్ట్రం నుంచి డీకే అరుణ ఉండగా.. పార్టీలో మార్పుల్లో భాగంగా జాతీయ కార్యవర్గంలో మరొకరికి చోటు కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదని సమాచారం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement