Sunday, April 28, 2024

ఘరానా మోసం, వ్యాపారం పేరట 1.71కోట్లకు కుచ్చుటోపీ..

వేల్పూర్‌, ప్రభన్యూస్‌: నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామానికి చెందిన సూత్రాల మహేష్‌(48) స్నేహ బంధంలో నమ్మి 1కోటి 71 లక్షలు పెట్టుబడులు పెట్టి మోసాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామస్తుడైన మంచంపల్లి కాశీ నరేందర్‌తో 12 సంవత్సరాల నుంచి స్నేహం వుంది. థాయిలాండ్‌లో వ్యాపారం చేస్తున్నా అని అక్కడి ఐడీ కార్డులు, కంపెనీ వివరాలు, లైసెన్స్‌ పత్రాలు చూపించగా అతని మాయమాటలు నమ్మాడు. 32 మంది థాయిలాండ్‌లో వాజీవా కంపెనీలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించవచ్చని హైదరాబాద్‌కు చెందిన మంచనపల్లి కాశీ నరేందర్‌ అనే వ్యక్తి ఆశ చూపడంతో సుమారు 1కోటి 71లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. ఇచ్చిన డబ్బులను దండుకొని టోకరా వేశాడు. బాధితుడు మహేష్‌ ఏమి చెయ్యాలో అర్ధంకాక తను మోసపోయినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు షాక్‌కు గురైనారు.

కాశీ నరేందర్‌ తాను వాజీవా కంపెనీకి డైరెక్టర్‌ను అని, ధాయిలాండ్‌లో తనకు హోటల్‌ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలలో పెట్టుబడిదారులు కావాలని ఆహ్వానించాడు. అతని మాయమాటలు నమ్మి లక్షలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టిన వీరి ఆశలు ఆవిరయ్యాయి. హైదరాబాద్‌ కొంపల్లిలో అడ్డా ఏర్పడుచుకొని అమాయక ప్రజలకు గాలం వేసే పనిలో నిమగ్నమైనాడు. అలాగే కెనడాకు వెళ్లేందుకు వీసా ఇప్పిస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి తమను నిలువునా దోపిడీ చేశారని బాధితుడు మహేష్‌ వాపోయారు. 42 లక్షల రూపాయలు వీసాలకు, 83 లక్షల రూపాయలు పెట్టుబడులు, 46 లక్షల రూపాయలు వ్యక్తి గత పెట్టుబడులు ఇలా మొత్తం 1 కోటి 71 లక్షల ఘరానా మోసం చేశాడు.

గత కొంతకాలంగా నరేందర్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో ఆందోళన చెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా నరేందర్‌పై వేల్పూర్‌ పోలీస్‌ స్టేషన్లో మే 29న కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కాశీ నరేందర్‌ కోసం ఎంత గాలించినా దొరకకపోవడంతో, తన అత్తగారి కుటుంబీకులను విచారణ చేయగా.. నరేందర్‌ డ్రగ్స్‌ మాఫియాతో పనిచేస్తున్నాడని, ఇతర నైజీరియా దేశానికి చెందిన వారితో ప్రతి నెలా లక్షలాది రూపాయల జీతాలను ఇస్తూ డ్రగ్స్‌ మాఫియా నడుపుతున్నాడని తెలిసింది. అంతేగాకుండా నరేందర్‌తో పాటు అతని సోదరుడు శ్రీనివాస్ హైదరాబాద్‌లో బడా నాయకులకు, వ్యాపారవేత్తలకు డ్రగ్స్‌ డోర్‌ డెలివరీ చేస్తున్నారని వీరితో చెప్పినట్టు వివరించారు. దీంతో తాను షాక్‌కు గురయ్యానని, ఆయనతోపాటు మరికొంతమంది నమ్మి పెట్టుబడుల పేరిట డబ్బులు ఇచ్చామని, ఇచ్చిన డబ్బుల వివరాలు బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా చెల్లించామని, వాటి వివరాలను వెల్లడించారు. ఉన్నతాధికారులు స్పందించి కాశీ నరేందర్‌ మోసాలపై, డ్రగ్స్‌ మాఫియాపై దృష్టి సారించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement