Friday, May 10, 2024

పభుత్వ ఆసుపత్రుల్లో ఎస్టీపీ ప్లాంట్లు.. నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మురుగు జల శుద్ధి ప్లాంట్‌ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పర్యావరణ, ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్ధ జలాలను శుద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు చొరవతో తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రధాన ఆసుపత్రుల్లో ఎస్టీపీలను నిర్మించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.134.46 కోట్లు మంజూరు చేసింది. ఇందులో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వాటా రూ.52.59 కోట్లు ఉన్నాయి. ఎస్టీపీలను ప్రభుత్వం అత్యాధునిక హైబ్రిడ్‌ యాన్యువిటీ మోడల్ (హెచ్‌ఏఎం)లో నిర్మిస్తోంది. రానున్న నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అనంతరం నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. నిర్మాణ సంస్థలే పదేండ్ల పాటు ప్లాంట్లను నిర్వహించనున్నాయి.

హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, టిమ్స్‌, నీలోఫర్‌ ఆసుపత్రులతో పాటు మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, సూర్యపేట, నల్గొండ, ఆదిలాబాద్‌ రిమ్స్‌, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌, సిద్దిపేట మెడికల్‌ కాలేజి, ఖమ్మం, కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మురుగు నీటి శుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఆస్పత్రుల నుంచి వివిధ రూపాల్లో విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు విడుదల చేయడం వల్ల పర్యావ్యవరణం కలుషితమవుతోంది. ఆపరేషన్‌ థియేటర్‌, ల్యాబ్స్‌, పేషంట్ల బెడ్‌ షీట్స్‌ ఉతికే సమయంలో, వార్డులను శుభపరిచే సమయంలో వచ్చే వ్యర్ధ జలాలను ముందుగా డిసిన్ఫెక్టు చేసి ఎస్‌ టి పి లకు పంపుతారు. అక్కడ నీటిని శుద్ది చేసి, పునర్వినియోగించుకునే విధంగా లేదా బయటికి వదులుతారు. ఇలా చేయడం వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement