Sunday, April 28, 2024

ఈనెల 5న మళ్లీ తిరుపతికి చంద్రబాబు?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 5న మరోసారి తిరుపతి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే చంద్రబాబు తిరుపతికి చేరుకుని.. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్‌ల పరిధిలో ఏర్పాటు చేసే బహిరంగసభల్లో పాల్గొంటారని తెలిపాయి. అయితే ఇటీవల చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంతో ఈసారి ఆయన పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే కుప్పం పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి దెబ్బ తగిలిన నేపథ్యంలో ఈసారి తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సొంత జిల్లాలోనే గెలవలేని చంద్రబాబు రాష్ట్రంలో ఎలా గెలుస్తారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికలు టీడీపీకి చావోరేవోగా మారాయి. అందుకే చంద్రబాబు బహిరంగసభలను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గర అవుదామని ప్రయత్నిస్తున్నారు. కానీ వైసీపీ చంద్రబాబు ప్రయత్నాలకు గండికొట్టేలా ఆయన పర్యటనలను అడ్డుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement