Sunday, May 5, 2024

నేటి సంపాద‌కీయం – ప్రజాస్వామ్యం వైపు అడుగులు!

సుందర కాశ్మీరాన్ని పర్యాటకులు ఇక సమీప భవిష్యత్‌లో సందర్శించగలరా? అన్న అనుమానాలు ముసురుకున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కాశ్మీర్‌లో ప్రగతికి బాట వేస్తున్నాయి. కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ఉగ్రవాదం తగ్గుముఖం పట్టినట్టు వార్తలు అందుతున్నాయి. ఇది చాలా హర్షించదగిన పరిణామం. రాష్ట్రంలో రెండు దశాబ్దాలు పైగా ఉగ్రవాదుల దాడులు కొనసాగడం వల్ల కాశ్మీర్‌లో అడుగు పెట్టాలంటే స్వదేశీ, విదేశీ పర్యా టకులు భయపడేవారు. కాశ్మీర్‌లోకి జిహాదీల పేరిట ఉగ్రవాదులు, సరిహ ద్దులు దాటుకుని మన దేశంలో ప్రవేశించడం నిత్యకృత్యంగా మారిన పరిస్థితుల్లో కొన్ని నెలలుగా ఉగ్రవాదుల ఊసే లేకుండా చేయగలగడం నిజంగా అపూర్వమైన విషయమే. గడిచిన కొన్ని నెలల్లో కాశ్మీర్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 600 మంది జిహాదీలు భద్రతాదళాల కాల్పుల్లో మరణించారు. వారి వద్ద భారీఎత్తున మందుగుండు నిలలనూ, మారణాయుధాలను సాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, స్థానికులతో జిహాదీల సంబంధాలు గతంలో మాదిరిగా కొనసాగడం లేదు. స్థానికుల చిరునామాలను సేకరించి వారిని ఉగ్రవాదుల నుంచి వేరు చేయడానికి భద్రతాదళాల వ్యూహం ఫలించింది. గతంలో కాశ్మీర్‌లో ఇంటింటిలో ఒక స్లీపర్‌ సెల్‌ పేరిట ఉగ్రవాదుల ఏజెంట్లు ఉండేవారు. ఇప్పుడు వారికి ఉపాధి లభిస్తున్న కారణంగా జిహాదీలతో సంబంధాలు పెట్టుకుంటే ఉన్నగోడు చెడు తుందన్న భయాన్ని వారిలో కలిగించడంలో భద్రతా దళాల వ్యూహం ఫలించింది.

కొవిడ్‌ కారణంగా విదేశీ,స్వదేశీ పర్యాటకుల సంఖ్య బాగా తగ్గింది. అయితే, కొవిడ్‌ తగ్గడంతో గడిచిన కొన్ని నెలల్లో 80 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శించినట్టు అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి. పరిస్థితులు క్రమంగా నెమ్మదిస్తుండటంతో కాశ్మీర్‌లో ఏప్రిల్‌ 24వ తేదీన పంచాయితీరాజ్‌ దినోత్సవాన్ని ప్రారంభించేందుకు కాశ్మీర్‌ని సందర్శించాలని ప్రధాని నరేంద్రమోడీ న్ణియిం చుకోవడం సందర్బోచితమే. కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా కొనసాగేట్టు చూడటానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. అభివృద్ది మండళ్ళను బలోపేతం చేయడం ద్వారా మూడంచెల వ్యవస్థ పనిచేసేట్టు చర్యలు తీసుకుంది. గత ఏడాది ప్రధాని కాశ్మీర్‌లో 11వేల పైగా కోట్ల రూపాయిల బడ్జెట్‌తో రోడ్డు మార్గాలు, వంతెనల అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు.

ఈపనుల్లో అతి ముఖ్యమైన చీనాబ్‌ నదిపై వంతెన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చుంది. దీని వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రాకపోకల సౌలభ్యం లభిస్తుంది. అలాగే, రెండేళ్ళ తర్వాత అమరనాథ్‌ యాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగు తున్నాయి. దీని వల్ల ప్రజల్లో ముఖ్యంగా యాత్రికుల్లో చిత్తస్థయిర్యం కలుగుతుంది. కాశ్మీర్‌లో పరిస్థితులు కుదుట పడటం పొరుగున ఉన్న పాక్‌ నాయకులకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నిన్నమొన్నటి వరకూప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌లో అనుకూల పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానిస్తుండగా, కాశ్మీర్‌ ప్రజలు ఇప్పటికీ భయం గుప్పిట్లో వణుకుతున్నారంటూ కొత్త ప్రధాని , పాక్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) నాయకుడు షెహ్‌బాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యా నించడం పాక్‌ నాయకుల అవకాశవాద వైఖరికి నిదర్శనం. పాక్‌లో ఎవరు ప్రధానమంత్రి పీఠమెక్కినా, కాశ్మీర్‌లో పరిస్థితిని భూతద్దంలో చూపిస్తూ ఉండాలి. వారిఉనికికి అది చాలా అవసరం. అంతేకాకుండా, కాశ్మీర్‌ విభజన గురించి షెహబాజ్‌ ఇప్పుడు వ్యాఖ్యానించడం అసందర్భమే కాకుండా, అసంగతం కూడా అది జరిగి రెండేళ్ళు దాటింది.

ఈ రెండేళ్ళలో రాష్ట్రంలో ఎన్నో సానుకూల పరిణామాలు సంభవించాయి. ముఖ్యంగా, రాష్ట్రంలో మహిళలు స్వేచ్చగా తిరగగలుగుతున్నారు. ముమ్మారు తలాక్‌ వల్ల తమ పట్ల వివక్ష పూర్తిగా తొలగిపోయినందుకు వారు ఎంతో ఆనందిస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల వారితో సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. రాష్ట్రంలో పంచాయితీరాజ్‌ సదస్సును ప్రారంభించడం ద్వారా ప్రజాస్వామ్య భావజాలాన్ని ప్రజల్లో నాటుకునేట్టు చేయాలన్న ప్రధాని మోడీ సంకల్పానికి ఇప్పుడు అనుకూల వాతావరణం నెలకొని ఉంది. అందుకే, ఆయన కాశ్మీర్‌లో ఇప్పుడు పర్య టించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో అసెంబ్లి నియోజకర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి కావస్తోంది. అది పూర్తికాగానే రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి. ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే అంతా మంచి జరుగు తుందన్ననమ్మకంతో ప్రధాని తీసుకుంటున్న చర్యలు ఫలిస్తాయనే ఆశిద్దాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement