Friday, April 26, 2024

నేటి సంపాదకీయం–తైవాన్‌ చర్చలపై ఉత్కంఠ!

ప్ర‌భ‌న్యూస్: తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా సాగిస్తున్న యత్నాలకు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయమై గత నెల చివరలో ఘాటుగా స్పందించింది. చైనా దాడి చేస్తే తైవాన్‌కు తమ దేశం అండగా నిలుస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ప్రకటించారు. అయితే, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తైవాన్‌పై తమ దేశం వైఖరిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టంచేశారు. అమెరికా విదేశాంగ శాఖ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసి ఉండవచ్చని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఈ మాదిరిగా తైవాన్‌పై మాట వెనక్కి తీసుకున్నట్టు ప్రకటన చేయడం ఇది మొదటి సారి కాదు. తైవాన్‌తో అమెరికాకు దౌత్య సంబంధాలు లేవు. కానీ, తైవాన్‌కి ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఆయుధాల వ్యాపారిగా అమెరికాపై ఏనాడో ముద్రపడింది. హాంకాంగ్‌పై చైనా పెత్తనాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

అలాగే, దక్షిణ చైనా సముద్రంలోదీవుల కోసం చైనా సాగిస్తున్న యత్నాలను వియత్నాం, ఫిలిప్పీన్స్‌, తదితర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు బిడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు వర్చువల్‌గా సమావేశం అవుతున్నారు. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. హాంకాంగ్‌ను తమ దేశంలో కలుపుకునేందుకు చైనా ప్రయత్నించినట్టే తమ దేశాన్ని కూడా ఆక్రమిం చుకోవడానికి బరితెగించవచ్చని తైవాన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిన్‌పింగ్‌ జీవిత కాల అధ్యక్షునిగా కొనసాగేందుకు వీలు కల్పించే తీర్మానాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ వచ్చేనెలలో ఆమోదించనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అదే జరిగితే, జిన్‌పింగ్‌ తన జీవితాశయ మైన తైవాన్‌ను చైనాలో కలుపుకునేందుకు ప్ర‌య‌త్నాలను ముమ్మరం చేయవచ్చు. , చైనా నుంచి వేరు పడిన తర్వాత తైవాన్‌ వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించింది. ఆ అభివృద్దిని సొంతం చేసుకోవాలన్నది చైనా తాపత్రయం.కరోనా సంక్షోభం సమయంలో తైవాన్‌ని చైనా ఆదుకోలేదు సరికదా, జపాన్‌ నుంచి వ్యాక్సిన్‌ను తెప్పించుకున్నందుకు చైనా అభ్యంతరం తెలిపింది.

తైవాన్‌కు జపాన్‌ ఆస్ట్రానికా వ్యాక్సిన్లు పంపినందుకు చైనా చిర్రుబుర్రులాడింది.. వ్యాక్సిన్లను స్వీకరించినందుకు తైవాన్‌పై విమర్శలు గుప్పించిం ది.తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమనీ, మరోసారి అలా చేయవద్దని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ హెచ్చరించారు. అలాగే, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియావంటి దేశాలను చైనా హెచ్చరించింది.అయితే, తమది స్వతంత్ర దేశమనీ, చైనా బెదిరింపులకూ, హూంకరింపులకూ బెదరబోమని తైవాన్‌ అధ్యక్షురాలు త్సైలింగ్‌ వాన్‌ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలతోతమ దేశానికి గల వాణిజ్య సంబంధాలను కాదనే హక్కు చైనాకు ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఆమె గతంలో భారత్‌ సందర్శించినప్పు డు కూడా చైనా తమపై ఆంక్షలను విధించడాన్ని తీవ్రంగా విమర్శించారు.

చెనాపాలకులు టిబెట్‌ మత గురువు దలైలామా పర్యటనలపైనా, ఆయనను విదేశీయులు కలుసుకోవడం పైనా ఆక్షేపణలు తెలుపుతోంది.దలైలామా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను పదవి నుంచి వైదొలగినా భారత్‌లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. వ్యక్తుల స్వేచ్చను హరించే హక్కు చైనాకు లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తులు, దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలనూ, అందరినీ తమ చెప్పు చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి చైనా సాగిస్తున్న యత్నాలు దుర్మార్గా నికి పరాకాష్ట అని పలువురు విదేశాంగ నిపుణులు పేర్కొంటున్నారు.గత నెలలో చైనా తైవాన్‌ గగనతలంలోకి యుద్ధ విమానాలను పంపినప్పుడు తైవాన్‌ రక్షణ మంత్రి చియు క్యూ చెంగ్‌ తీవ్రంగా స్పందించారు. తైవాన్‌ స్వతంత్ర దేశమనీ, తమ అధికారాన్ని కాపాడుకునే సత్తా ఉందని స్పష్టం చేశారు.తైవాన్‌తో ఒప్పందాన్ని గౌరవిస్తానని ప్రకటిస్తూనే తైవాన్‌ని కవ్వించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చైనా, అమెరికా అధ్యక్షుల మధ్య జరిగే వర్చువల్‌ చర్చల ఫలితాలు ఎలా ఉంటాయోనని ప్రపంచ దేశాల నేతలు ఉత్కంఠతోఎదురు చూస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement