Monday, April 29, 2024

స్టాక్ మార్కెట్‌లోకి పీఎఫ్‌ నిధులా ..

ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌- ఈపీఎఫ్‌) సొమ్మును స్టాక్‌ మార్కెట్‌లో లేదా మ్యూచువల్‌ఫండ్‌లో పెట్టుబడిగా పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు వచ్చిన వార్తలు ఉద్యోగుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఉద్యోగులు రిటైరైన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందడం కోసమే దీనికి భవిష్య నిధి అని పేరు పెట్టారు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల వేతనాల్లోంచి కొంత శాతాన్ని వసూలు చేసి అంతే మొత్తాన్ని యాజమాన్యాలు చెల్లించేట్టుగా భవిష్యత్‌ నిధి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తంలో ఉద్యోగులు రిటైర్‌ కాకుండానే ఆడపిల్లల పెళ్ళిళ్ళకు, ఇళ్ళ నిర్మాణానికి ముందుగా వాడుకునే సౌలభ్యం ఉంది. చాలా మందికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది.ఇప్పుడు ఈ నిధుల పైన కూుడా ప్రభుత్వం కన్నుపడింది. కేంద్రం ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా పిఎఫ్‌ నిధులను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

దీని వల్ల ఉద్యోగులకు తీరని నష్టం కలుగుతుందని యూనియన్లు స్పష్టం చేశాయి. అప్పుడుప్రభుత్వం వివరణ ఇచ్చింది.స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వేరు, మ్యూచువల్‌ ఫండ్‌లో నైనా స్టాక్‌ మార్కెట్లలో నైనా ఒకటేననీ,ఉద్యోగుల సొమ్ముకు ఢోకా ఉండదని వివరణ ఇచ్చింది.అయితే, ఉద్యోగుల వాదన వేరుగా ఉంది. స్టాక్‌ మార్కెట్‌లో నైనా, మ్యూచు వల్‌ ఫండ్‌లోనైనా వాటి ధరలు పడిపోతే ఉద్యోగులకు నష్టం వస్తుందనేది యూనియన్ల వాదన. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి వేరే మార్గాలు అన్వేషిం చుకోవాలి.ఉద్యోగుల భవిష్యత్‌ నిధిని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదు. ఈ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నిధుల ను కూడా మళ్ళించాలని ఒత్తిడి తెచ్చింది. రఘురామ్‌ రాజన్‌ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఈ విషయమై ప్రభుత్వానికి ఆయన నిక్కచ్చిగా చెప్పడం వల్లనే ఆయన తిరిగి పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదన్న కథనాలు అప్పట్లో వెలువడ్డాయి.

విదేశా ల్లో ఉండే ప్రవాస భారతీయులు పోర్టుఫోలియో ఇన్వెస్టు మెంట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటు న్నారు. ఈ విధంగా ఇటీవల వేల కోట్ల రూపాయిల పెట్టు బడుల ఉపసంహరణ జరిగింది. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కితెస్తానని అధికారంలోకి రాకముం దు ప్రకటించిన ప్రధానమంత్రి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పిఎఫ్‌ నిధులను స్టాక్‌ మార్కెట్‌లో ముందు ఐదు శాతం మాత్రమే పెట్టుబడులు పెట్టి దాని నుంచి పది శాతానికీ, ఇప్పుడు 20 శాతానికి పెంచిన ప్రభుత్వం రేపు 50 శాతం చేసినా ఆశ్చర్యం లేదు. దీనినే ఉద్యోగ సంఘా లు ఎత్తి చూపుతున్నాయి. రావల్సిన సొమ్మును వసూలు చేసుకోలేని ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల నిధులను స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఏ మాత్రం సమం జసం కాదు. బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీల వంటి వారి నుంచి బకాయిలను కక్కిస్తామంటూ ఆర్థిక మంత్రి, ప్రభుత్వంలోఉన్నత స్థాయిల్లో ఉన్న వారు ఎన్నో ప్రకట నలు చేశారు. అవన్నీ నీటిమూటలయ్యాయి. ఆదాయం కోసం ప్రజలపై భారం మోపడమే ప్రభుత్వానికి తెలిసిన విద్య అని ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు.

రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాల పరిస్థితి అలాగే, ఉంది. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నానని చెప్పుకుంటూ వేల కోట్ల రూపాయిలను ఉచిత పథకాలకు ఖర్చు చేస్తు న్నారు. ప్రధానమంత్రి ఇంతకాలం ఊరుకుని ఇప్పుడు ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తాయని సన్నా యి నొక్కులు నొక్కుతున్నారు.ఈ విషయాన్ని పదేళ్ళ క్రితమే ఆనాటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ చెబితే ఆయనను ప్రపంచ బ్యాంకు ఏజెంట్‌ అంటూ అవహే ళన చేసిన పార్టీలు, నాయకులు మన దేశంలో ఉన్నారు. అయితే, అభివృద్ధి కార్యక్రమాలెంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యమంటూ పాలకులు సంజాయిషీ చెప్పుకుంటూ వచ్చారు.సంక్షేమానికి అందరి కన్నా తామే ఎక్కువ ఖర్చు చేస్తున్నామని గొప్ప లు చెప్పుకోవడం తప్ప ఆదాయ మార్గాలను రాష్ట్రాలూ పెంచుకోవడం లేదు.మద్యంపై ఆధారపడి రాష్ట్రాలు ఆదాయాలను సమకూర్చుకుంటున్నాయన్న మాటల్లో అణు మాత్రం అసత్యం లేదు. అదే సందర్భంలో కేంద్రం లో కూడా ఆర్థిక క్రమశిక్షణ డొల్లగానే ఉంది. ఆదాయం కోసం ప్రభుత్వం వేరే మార్గాలను అన్వేషించుకోవాలి. వ్యాపారం చేయడం ప్రభుత్వం బాధ్యత కాదని మోడీ ఇటీవల ఒక సందర్భంలో స్పష్టం చేసిన ప్రధాని ఈ చర్య ను ఎలా సమర్ధించుకుంటారు?. వనరులు పెంచుకోవ డానికి కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ కొత్త పథకాలతో ఉపాధి కల్పన కార్యక్రమాలను చేపట్టడానికి బదులు ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా ప్రజల సొమ్ముతో వ్యాపారం చేయడానికి సిద్ధమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement