Friday, April 26, 2024

ఎడిటోరియ‌ల్ – విధి లేక దిగొచ్చిన పాక్..

భారత్‌తో మూడు యుద్ధాలు చేసి గుణపాఠం నేర్చుకున్నామంటూ పాకిస్తాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ చేసిన ప్రకటనను జ్ఞానోదయంగా తీసుకోవాలా లేక, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చేసిన ప్రకటన అని అనుకోవాలా అని విశ్లేషకులున తర్జన భర్జన పడుతు న్నారు. పాకిస్తాన్‌కి జ్ఞానోదయం కలగడం అనేది కలలో మాట. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, ఎప్పటికప్పుడు పరగడుపు అన్న చందంగా వ్యవహరిస్తున్న పాక్‌ తమ దేశంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో షరీఫ్‌ ఆ ప్రకటన చేసి ఉంటారు. ఆయనకు ముందు ఆ పదవిని నిర్వహించిన వారు కూడా శాంతి వచనాలు వల్లించి, చివరికి కయ్యానికి కాలు దువ్వారు. షెహబాజ్‌ కేబి నెట్‌ లో విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్న బిలావల్‌ భుట్టో ఇటీవల భారత్‌పై విషం కక్కారు. ఆయన తాత, మాజీ ప్రధాని జుల్ఫికర్‌ ఆలీ భుట్టో భారత్‌తో వెయ్యేళ్ళ యుద్ధం చేస్తానని ప్రకటించారు. ఆయన కుమార్తె, మరో మాజీ ప్రధాని బెనెజీర్‌ భుట్టో ఘర్షణాత్మక వైఖరి గురించి అందరికీ తెలిసిందే. అయితే, ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ సోదరుడు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మాత్రం యుద్ధం ప్రస్తావన చేయకపోయినా, భారత్‌పై తన వ్యతిరేక భావాలు దాచుకునేవారు కారు. ఇప్పుడు షెహబాజ్‌ ఈ ప్రకటన చేయడానికి అంతర్గతంగా ఉన్న పరిస్థితులే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి దివాళా అంచుల్లో ఉంది. పాక్‌లో ఇటీవల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. గోధుమ పిండి పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. అఎn్గాన్‌నుంచి వస్తున్న వలసదారులకు ఆశ్రయం ఇవ్వడం పాక్‌ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా ఉంది. మరో వైపు అఎn్గాన్‌కి చెందిన తాలిబన్లు పాక్‌లో ఉన్న తమ సంస్థ శాఖ సభ్యులను రెచ్చగొడుతు న్నారు. పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు దాడులు జరుపుతున్నాయి. ఈ కారణాలన్నింటి దృష్ట్యా పాక్‌ ప్రభుత్వం వైఖరిలో కొంత మార్పు వచ్చి ఉండవచ్చు.

ఇంతకాలం పాక్‌కి రక్షణగా ఉన్న చైనా ఉగ్ర వాదం విషయంలో పాక్‌పట్ల మెతకగా వ్యవహరిస్తున్న చైనా ఇప్పుడు బిగింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. లష్కర్‌ ఎ తోయిబా నాయకుడు అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటిం చినప్పుడు చైనా అడ్డు పడలేదు. అంతకుముందు లష్కర్‌, జైష్‌ల సభ్యులపై ఉగ్రవాద ముద్రను వేయకుండా చైనా అడ్డు పడింది. మక్కీవిషయంలో జోక్యం చేసుకోలేదు. స్పందించలేదు. అలాగే, హక్కానీ నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ సంతృప్తి చెందితేనే పాకిస్తాన్‌కు నాటోయేతర మిత్ర దేశం ప్రతిపత్తి ఇవ్వాలని అమెరికా ప్రతినిధుల సభలో సభ్యుడొకరు ప్రతిపాదిస్తూ ఒక బిల్లు ప్రవేశ పెట్టారు. దీనిని ప్రతినిధుల సభ, అంతిమంగా బిడెన్‌ ఆమోదిస్తే పాక్‌కి ఆ హోదా హుళక్కి అవుతుంది. ఇక పాక్‌కి అంతర్జాతీయద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి రుణం పొందే అవకాశం లభించకుండా అమెరికా, తదితర దేశాలు అడ్డుపడుతున్నాయి.

సౌదీ అరేబియా రాకు మారుడు పాకిస్తాన్‌కి ఆర్థిక సాయం విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. పాక్‌ సైనిక దళాల ప్రధా నాధికారిగా జనరల్‌ బజ్వా స్థానంలో మునీర్‌ని నియ మించడం సైన్యంలో అధిక సంఖ్యాకులకు ఇష్టం లేదు. ఈ కారణాలన్నింటి దృష్ట్యా పొరుగు దేశంతో కయ్యానికి కాలు దువ్వితే నెగ్గుకు రాలేమన్న కారణంగానే షెహబాజ్‌ వెనక్కి తగ్గి ఉంటారు. నిజానికి పాక్‌ సైన్యానికి ఇది మిం గుడు పడని విషయమే. భారత్‌తో పాక్‌ సైనికాధికారులు ఎప్పుడూ యుద్ధాన్నే కోరుకుంటారు. అలనాడు యాహ్యాఖాన్‌, ఆయూబ్‌ఖాన్‌ తదితర సైనికాధి కారు లంతా భారత్‌ని శత్రు దేశంగానే పరిగణించారు. పరి స్థితులు మారాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొన సాగుతుండటంతో అన్ని దేశాలూ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సౌదీ అరేబియా కూడా ఇటీవల భారత్‌పై కాలుదు వ్వొద్దని పాకిస్తాన్‌ను హెచ్చరించింది. ఉక్రెయిన్‌ యుద్ధం అన్ని దేశాలకూ పాఠాలు నేర్పింది. నాటో కూటమి సౌహార్ద సభ్యత్వం హుళక్కి అయితే, పాకిస్తాన్‌ని ఆదు కునే దేశమేదీ ఉండదు. అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు సారాంశం అదే.
మరోవంక మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పదేపదే భారత నాయకత్వాన్నీ, సైన్యాన్ని పొగడటంతో షెహ బాజ్‌ ఇరుకున పడు తున్నారు. ఎటువైపు చూసినా నిరాశా నిస్పృహలు, నిస్సహాయ స్థితి తాండవించడంతో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు అడుగు వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఆయన దిగి వచ్చినట్టున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement