Thursday, May 9, 2024

విశ్వహితుడు నారదమహర్షి

నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారి. చేతుల్లో చిరుతలు, మహితి అనే వీణా ధారియై, హరినామ సంకీర్తన చేస్తూ, నిరంతరం తిరుగాడడమే ఆయన పని. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతుంటాడు. ఆయన ఒక ”ఆదర్శ పాత్రికేయుడు”. మంచిచెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాల న్నిటిలోనూ ఆయన ఉంటాడు. నారదుడి పేరు ప్రస్తావించని హిందూ పురాణం లేదు. అష్టాదశ పురాణాలు, రామాయణ, మహా భారతాల్లోనూ నారదుడు పాత్ర గురించి వివరించారు.
నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే నారద జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది. నారదుడు మూడు లోకాల్లోను సంచరిస్తూ భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుం టాడు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్ష మార్గాన్ని చూపిం చాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంతమంది మేధావులు, రచయి తలు మాత్రం ఆయన్ను ‘కలహ భోజనుడు’గా ‘కలహ ప్రియుడు’ గా అభివర్ణించారు. వాస్తవానికి, నిజం మాట్లాడే వారికి ఎప్పుడు కష్టాలే. ”యదార్ధవాది లోక విరోధి”. ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వారంటే చిన్నచూపు. వారిని లోక విరో ధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించేవాడు. ముల్లోకా లలోనూ సంచరిస్తూ దేవ, మానవ, దానవులకు సందర్భాను సారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.
బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి, నారాయణ బక్తుడు, ముక్తుడు అయిన నారదుడు విశ్వహితుడు. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిష త్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి. నారదుని పాత్ర చాలా పురాణాలలో కనిపిస్తుంది.
భాగవతం, ప్రధమ స్కంధంలో నారదుడు వేదవ్యాసునికి భాగవతం రచింపమని బోధిస్తాడు. ఈ సందర్భంలోనే నారదుడు తన పూర్వగాథను వ్యాసునకు వివరిస్తాడు. రామాయణం, బాలకాండలో నారదుడు వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమనీ, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందనీ ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది. మహాభాగవతం మొదటి స్కంధంలో నారదుడు తన గాథను స్వయంగా వేదవ్యాసునికి తెలిపాడు. తాను పూర్వజన్మ పుణ్యకారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచ రింపగలుగుతున్నానని చెప్పాడు.
పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పనిచేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచ రించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయా భావాన్ని తెలుసుకొన్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్ష ణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యక్‌ దర్శనుడు అవుతాడని గ్రహించాడు. ఆయన తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధముల నుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ డంలో నిమగ్నమై ఉంటాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్య వాణి ఇలా ఆదేశమిచ్చింది- ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు. కాని నా దర్శనంవల్ల నీ సందేహా లు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొందగలవు. నారదుడు సంతు ష్టుడై నిరంతరం హరినామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైన పుడు తన దేహాన్ని త్యజించాడు.
అనంతరం ప్రళయ కాలం సమీపించగా, ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో, నిద్రకు ఉప క్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశించి, ఆయనలో లీన మయ్యాడు. వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపు డు, బ్రహ్మ ప్రాణముల నుండి మరీచి మొదలైన మును లతోబాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నార దుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగు తుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది. ఇలా తన కథ చెప్పి హరికథా గానం తో నిండివున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేదవ్యాసునికి ఉపదేశించాడు.
మహాభారతం సభాపర్వంలో నారదుని గురించి… వేదోప నిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజి తుడు. కల్పాతీత విశేషాల నెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతి జ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచిచెడులను వేరువేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయ వాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధ కామ మోక్షముల యధార్ధ తత్వము నెరిగినవాడు. సమస్త బ్రహ్మాండముల యందును, ముల్లోకముల యందును జరుగు సంఘటనలను తన యోగబల ముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవదానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్తవ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి.
వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురా ణం ఒకటి. ఈ పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అనికూడా పిలుస్తారు. నారద పురాణంలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు భాగాలు ఉన్నాయి. పుర్వార్థం సంభాషణ సనక మహర్షికి నారదుడుకి మధ్య జరుగు తుంది. రెండవ భాగం అయిన ఉత్తరార్థంలో వశిష్ఠ మహర్షి వక్త, మాంధాత శ్రోత. ఈ పురాణంలో వేద వేదాంగాలు, వివిధ దేవతా కవచాల గురించి చెప్ప బడింది. బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి అయిన నారదుడు విశ్వహితుడు.

  • రామ కిష్టయ్య సంగనభట్ల
    9440595494
Advertisement

తాజా వార్తలు

Advertisement