Sunday, April 28, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

113. క్షితినాథోత్తమ సత్కవీశ్వరుడు వచ్చెన్ మిమ్ములం జూడగా
నతడో మేటి కవిత్వవైఖరిని సద్యః కావ్యనిర్మాత త
త్ప్రతిభ ల్మంచివి, తిట్టు పద్యము చెప్పం డాతడైనన్, మమున్
క్రితమే చూచెను బొమ్మ టందు రధముల్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, క్షితినాథ- ఉత్తమా- రాజులలోశ్రేష్ఠుడా!, మిమ్ములన్- మిమ్ము, చూడగాన్- దర్శించటానికి, సత్-కవి- ఈశ్వరుడు- మంచికవిరాజు, వచ్చెన్-వచ్చినాడు, అతడు- ఓ- ఆకవి ఎటువంటి వాడు అంటే, కవిత్వవైఖరిని- కవితారీతులలో, మేటి- దిట్ట/శ్రేష్ఠుడు, సద్యఃకావ్యనిర్మాత- ఆశువుగా కావ్యాన్ని రచించగలడు, తత్- ప్రతిభల్- అతడి తెలివితేటలు, మంచివి- మేలైనవి, తిట్టుపద్యములు-నిందాకవిత్వం, చెప్పండు- రచించడు, (అనగా) అధముల్- నీచులైనరాజులు, అయినన్- అయితే, అతండు- ఆ కవి, మమున్- మమ్మల్ని, క్రితమే-ఇంతకు మునుపే, చూచెను- దర్శించుకున్నాడు, పొమ్ము- అట-అందురు- పొమ్మని చెప్పు అంటారు.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! “ఓ రాజా! నీ దర్శనం కోసం ఒక మంచికవిశేఖరుడు వచ్చాడు. అతడు కవిత్వరీతులలో దిట్ట. ఆశువుగా కావ్యమునే నిర్మించగలడు. తిట్టుకవిత్వం వ్రాయడు. ప్రతిభావంతుడు.” అని ( పరివేష్ఠిమ్ చి ఉన్నవారు) చెపితే, అధములైన రాజులు “అతడైతే ఇంతకు ముందే మమ్మల్ని కలిశాడు. వెళ్ళమని చెప్పవలసింది.” అంటారు.
విశేషం: ఈ పద్యంలో కవి లక్షణాలతో పాటు, రాజుల అభిరుచులు కూడా వెల్లడి అవుతాయి. కవితారీతులు తెలిసి ఉండటం, ఆశుధార కలిగిఉండటం, తిట్టుకవిత్వం జోలికి పోకుండా ఉండటం, ప్రతిభాశాలి అయి ఉండటం, మంచికవికి ఉండవలసిన లక్షణాలు. కాని, అవి రాజులకి అక్కరలేదు. ఈ లక్షణాలున్న కవిని వారు ఆదరించరు. అది వారి రసహీనతకి చిహ్నం.
“నవనవోన్మేషశాలినీ ప్రతిభా”– ఎప్పటి కప్పుడు క్రొత్తగా చిగురించే మేథాసంపదే ప్రతిభ.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement