Wednesday, May 29, 2024

సోమవార వ్రత పద్ధతులు!

శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మా సంలో సోమవారం ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తే అష్టైశ్వర్యాలు కలు గుతాయని శాస్త్రం చెబుతోంది.
ఈ మాసంలో భక్తులు విష్ణు ఆలయం, శివాల యలాలను సందర్శిస్తారు. కార్తీకం నెలరోజులు ఉప వాసాలు, నక్తాలు చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో భగవ న్నామ స్మరణతో గడుపుతారు. అయితే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించదలచిన వారు ముఖ్యంగా కార్తీక సోమవారాలలో చేయవలసిన విధివిధానాలను కార్తీక పురాణంలో చక్కగా వివరించారు.
వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీకమాస మహత్యాన్ని వివరిస్తూ ఈ మాసంలో శివునికి అత్యంత ఇష్టమైన సోమవార వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని, వారికి ముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమ వారం అయినా స్నాన, జపాదులను ఆచరించినా వారు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారని తెలిపారు.
కార్తీక సోమవారం రోజు ఆరు పద్ధతులను ఆచరించాలని, ఆరు చేయలేనివారు ఏదో ఒక పద్ధతిలో అయినా కార్తీక సోమవార వ్రతాన్ని చేస్తే పుణ్యం లభిస్తుందని, సద్గతులు ప్రాప్తిస్తాయని వశిష్ట మహర్షి వివరించారు. సోమవారంనాడు ఆచరించాల్సిన ఆరు పద్ధతులు- ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము.
కార్తీక సోమవారం రోజంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాల సమ యంలో శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించా లని పేర్కొన్నారు. దీనిని ఉపవాస దీక్ష అంటారని వశిష్ఠుల వారు తెలిపారు.
రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండలేనివారు కార్తీక సోమవారం తెల్లవారుజామునే స్నానం చేసి దాన, జపాలు యధా విధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజ నానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలని వశిష్ఠుల వారు చెప్పారు. దీనిని ఏకభుక్త ము అని, ఒక పూట భోజనం చేసి భగవంతుని మీద మనసును లగ్నం చేసి నిష్టగా పూజించాలని తెలిపారు.
పగలంతా ఉపవాసం చేసి, ఏమీ తినకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ, ఉపహా రం కానీ తీసుకోవడాన్ని నక్తం అంటారని వశిష్ఠులవా రు పేర్కొన్నారు. అంటే పూర్తిగా ఆహారం లేకుండా దీక్ష చేయడం, ఒకపూట మధ్యాహ్న సమయంలో భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా వ్రతాన్ని చేయడం, రోజంతా తినకుండా రాత్రి సమయంలో భోజనం చేయడం ద్వారా కార్తీకమాస సోమవార వ్రతాన్ని చేయవచ్చునని వశిష్ఠ మహర్షి సూచించారు.
ఇంట్లో భోజన ఏర్పాట్లు ఏమీ చేయకుండా ఎవరైనా భోజనం పెడితే ఆ భోజనాన్ని మాత్రమే చేయడాన్ని అయాచితము అంటారు. ఈ విధానంలో కూడా కార్తీక సోమవార వ్రతాన్ని చేయవచ్చని వశిష్ఠ మహర్షి తెలిపారు.
ఇలా ఏవిధమైన ఉపవాసానికి శక్తిలేనివారు స్నాన, జపాదులు చేసినప్పటికీ సరిపోతుందని, మంత్రవిధులు కూడా రానివారు స్నాన, జపాదులు తెలియనివారు కార్తీక సోమవారంనాడు నువ్వులను దానంచేసినా సరిపోతుందని వశిష్ఠుడు జనకుడికి తెలిపారు. కార్తీక సోమవారం నాడు నిష్ఠగా ఈ ఆరు పద్ధతులలో దేనిని అయినా ఆచరించినా శివ సాయుజ్యం లభిస్తుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు బోధించారు. అప్పటి నుండి భక్తులు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement