Saturday, July 27, 2024

T20 : జ‌ట్టు కూర్పులో రోహిత్ కు త‌ల‌పోటు… కోహ్లీ, య‌శ‌స్వీ మ‌ధ్య దాగుడుమూత‌లు

మరో నాలుగు రోజుల్లో మహా సమరం ప్రారంభం కానుంది. జూన్ 2న నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ పొట్టి ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సారి కప్‌ను ముద్దాడాలని పక్కా ప్రణాళికలతో యూఎస్‌ఏలో అడుగుపెట్టింది. అయితే ప్రత్యర్థితో కంటే జట్టు కూర్పుతోనే భారత్ ఎక్కువగా పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది.

- Advertisement -

గాయాల నుంచి కోలుకుని రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య తిరిగి రావడంతో జట్టు బలోపేతంగా మారడంతో పాటు గందరగోళంగా ఏర్పడింది. అంతేగాక ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కొందరు ఫామ్‌లేమితో ఉన్నారు. అలాగే రెండు నెలలు పాటు ఆటగాళ్లు అవిరామంగా క్రికెట్ ఆడారు.

మెగా టోర్నీకి ఇది మంచి సన్నాహకంగానే ఉంటుంది. కానీ టీమిండియాలో ఆడే స్థానాల్లో ఫ్రాంచైజీల తరఫున మన ఆటగాళ్లు ఆడలేదు. వన్‌డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లి ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా వచ్చాడు. మిడిలార్డర్‌లో ఆడాల్సిన సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌కు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక సీఎస్కే తరఫున శివమ్ దూబె నాలుగో స్థానంలో ఆడాడు. కానీ భారత జట్టులో వాళ్లు ఆడే స్థానాలు భిన్నంగా ఉన్నాయి.

మరోవైపు దూబె, సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, హార్దిక్ పాండ్య ఫామ్‌లో లేకపోవడం టీమిండియాను తీవ్రంగా కలవరపెడుతోంది. అయితే ఫామ్ లేకపోయినప్పటికీ ఈ ఆటగాళ్లకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల వరకు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. భారత్ గ్రూప్ దశ నుంచి సూపర్-8కు అర్హత సాధించడం కష్టతరమేమి కాదు. దీంతో గ్రూప్ స్టేజ్‌లోనే జట్టు కూర్పును సిద్ధం చేసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో సంజు శాంసన్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్‌లను కొన్ని మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేయాలని ప్లాన్ చేస్తోంది. తుదిజట్టులో సెలక్ట్ అయ్యే మిగిలిన ఆటగాళ్లు అట్టర్ ఫ్లాప్ అయితే సూపర్-8లో ఈ నలుగురికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. కాగా, గ్రూప్-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, ఆతిథ్య జట్టు అమెరికా ఉన్నాయి. న్యూయార్క్ వేదికగా జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌) సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్.

రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అవేష్‌ ఖాన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement