Saturday, April 27, 2024

వేదోద్ధరణ అవతారమే హయగ్రీవుడు

జ్ఞానానందమయం దేవం, నిర్మలం స్ఫటికా కృతిం, ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహ”

పురాణ తిహాసాలలో దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీహరి దాల్చిన అవతారాల్లో ప్రసిద్ధమైన హయ గ్రీవ అవతారం ఒకటి. సమస్త విద్యలను, జ్ఞానాన్ని పాండిత్యాన్ని అనుగ్రహించే శ్రీ గురుమూర్తి హయ గ్రీవ స్వామి. వేదోద్ధరణకై సంభవించిన అవతారమే ఇది. మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలిస్తే, విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి…వేదాలను రక్షించాడు. హిందూమతంలో, హయగ్రీవ స్వామి ని కూడా విష్ణుమూర్తి అవతారముగా భావిస్తారు. గుర్రపుముఖంతో, నరశరీరంతో, చతుర్భుజుడై శంఖచక్రాలను ధరించి వామాంకంలో లక్ష్మీదేవి సహితంగా ఆవిర్భవించిన సాక్షాత్తు శ్రీమన్నారాయ ణుడే హయగ్రీవ స్వామి. ఆయనలో సకల దేవత లూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నా యి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలు గా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా… ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. హయగ్రీవున్ని జ్ఞానమునకు, వివేకమున కు, వాక్కుకు, బుద్ధికి, అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల దేవుడు గా పూజిస్తారు. జ్ఞానం, వాక్కు, ఆచారము నాశనం కాకుండా సాగునట్లు అనుగ్రహించిన హయగ్రీవ మూర్తిగా శ్రావణ పూర్ణిమ నాడు మహా విష్ణువును కొలవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. హయ గ్రీవుడనగా గుర్రం శిరస్సు, మానవ దేహం కలిగిన స్వామి, నరసింహ స్వరూపం వలే వైకుంఠ నాథుడు హయగ్రీవ ధారియైనారు. ‘హయ’ అనగా విజ్ఞానం. ‘గ్రీవ’ అనగా కంఠం. అన్ని విద్యలూ కంఠస్థమై ఉన్న సర్వ విద్యా రూపమే హయగ్రీవ మూర్తి.
భాగవతంలో సప్తమ స్కంధంలో హయగ్రీవుడు బ్రహ్మ చేసిన యజ్ఞంలో ఆవిర్భవించినట్లు, స్కంద పురాణంలో దేవతల ప్రార్ధనలతో విష్ణువు అశ్వము ఖులై అవతరించినట్లు, పూర్వగాథాలహరిలోనూ హయగ్రీవ వృత్తాంతాలు పేర్కొనబడినాయి. దేవీ భాగవతం ప్రకారం ఒకానొక సమయాన మహా విష్ణువు రాక్షసులతో పదివేల ఏళ్ళు భీకర యుద్ధం చేసి అలసి పోయి, అల్లెత్రాడు గట్టిగా బిగించి ఉన్న ధనుస్సును నేలమీద నిలబెట్టి, దాని కోపుమీద తమ గడ్డాన్ని ఆనించి, నిలబడే నిద్ర పోయారు. విష్ణువును వెదకుతూ వచ్చిన దేవతలు, నిద్ర లేపడానికి భయ పడి, బ్రహ్మ దేవుడు ఒక చెద పురుగును సృష్టించి, వింటి నారిని కొరకమని చెబుతారు. పురుగు కొరక డంతో ధనుస్సు విసురుగా తుళ్ళి, వింటికి ఉన్న బాణం కొన విష్ణువు మెడకు తగిలి, ఆయన శిరస్సు తెగి, ఎగిరిపోయింది. దేవతలంతా మహాదేవిని ప్రార్ధించగా, ఆమె ప్రత్యక్షమై సూచించిన విధంగా గుర్రాన్ని వధించి, దాని తలను తెచ్చి దేవశిల్పి యైన త్వష్ట ద్వారా విష్ణువు మొండానికి అతికించారు. బ్రహ్మ ప్రాణం పోయగా, హయగ్రీవులైనారు.
మధు కైటభులనే ఇర అసురులు, బ్రహ్మ నుండి వేద విద్యను దొంగిలించి, రసాతలానికి పారిపో యారు. హయగ్రీవ రూపంలోని శక్తితో మాత్రమే తాను మరణించునట్లు, హయగ్రీవుడనే రాక్షసుడు, బ్రహ్మ ద్వారా పొందిన వరం కారణంగా, దేవి కృప వల్ల హయగ్రీవ అవతారులైన విష్ణు అదే పేరు గలిగిన అసుర సంహారం చేయడంజరిగింది. తాను చంద్రమండల వాసియైన హయగ్రీవుడు, మహానం ద స్వరూపుడు. హయగ్రీవ విరాట్‌ స్వరూపాన సత్యలోకం శిర స్సుగా, భూలోకం నాభిగా, పాతాళం పాదాలుగా, అంతరిక్షం కళ్ళుగా, సూర్యుడు కంటి గుడ్డుగా, చం ద్రుడు గుండెగా, దిక్పాలకులు భుజాలుగా, అగ్ని ముఖంగా, సముద్రాలు ఉదరంగా, నదులు, పర్వ తాలు ఎముకలు, మేఘాలు కేశాలుగా, సర్వ దేవతా స్వరూపులైనారు. హయగ్రీవుడు తెల్లని శరీరం కల వాడు. లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకుని, తెల్లని పద్మాసీనులై ఉంటారు. కుడిచేతిలో చక్రం, పై ఎడ మ చేతిలో శంఖం, కింది ఎడమ చేతిలో పుస్తకం, కింది కుడిచేయి చిన్ముద్ర ధరించి ఉంటారు. శ్వేత పద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానా నికి, పుస్తకం సకల విద్యలకు, శంఖం సకల సృష్టికి కారణభూతమైన నాదానికి, చక్రం అజ్ఞాన సంహా రానికి చిహ్నాలు.
హయగ్రీ వుని ఉపాసించిన వారికి సకలం కలుగు తాయని విశ్వాసం. ఏ దేవతకైనా నామమే శరీరమ ని, ఆ నామంలోని అక్షరాలే అవయవాలని శాస్త్ర వచ నం. అందుకే వైష్ణవులకు ఆధ్యాత్మిక విద్యాభ్యాసం హయగ్రీవ నామోపదేశంతో ప్రారంభించడం సం ప్రదాయం. హయగ్రీవ నామాన్ని ఉచ్చరించే వారు శివస్వరూపులుగా, పలికిన వారు విష్ణు స్వరూపులు గా, విన్నవారు బ్రహ్మ స్వరూపులుగా అవుతారని బ్రహ్మ చెప్పడాన్ని బట్టి హయగ్రీవ నామ ప్రాధా న్యత స్పష్టం అవుతుంది.

  • రామకిష్టయ్య సంగనభట్ల
    9440595494
Advertisement

తాజా వార్తలు

Advertisement