Saturday, April 27, 2024

గీతాసారం(ఆడియోతో….)

అధ్యాయం 7, శ్లోకం 24

అవ్యక్తం వ్యక్తిమాపన్నం
మన్యంతే మామబుద్ధయ:
పరం భావమజానంతో
మమావ్యయమనుత్తమమ్‌ ||

తాత్పర్యము : నన్ను సం పూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడనైన నేను (శ్రీకృష్ణుడు) తొలుత నిరాకారుడనై యుండి ఇపుడు ఈ రూపము దాల్చితినని తలతురు. అల్పజ్ఞత వలన వారు నాశ రహితమును మరియు అత్యత్తమును అగు నా దివ్య భావమును ఎరుగలేరు.

భాష్యము : దేవతలను పూజించే వారినే కాక నిరాకారవాదులను కూడా ఇక్కడ భగవంతుడు ‘అబుద్ధయ:’ ‘తెలివి లేనివారు’ అని సంభోదిస్తున్నాడు. కృష్ణుడే స్వయముగా అర్జునుడితో మాట్లాడుచూ ఉన్నా, వారు ఆయనకు రూపము లేదు, అనుటలో అర్థము లేదు. శ్రీ కృష్ణుడు దేవకీ సుతుడు, ఒక గొప్ప వ్యక్తి మాత్రమే అని అనుట తెలివితక్కువ తనము. దీనినే రాబోవు తొమ్మిదవ అధ్యాయములో ‘అవజానంతి మాం మూఢా:” మూఢులు నన్ను అర్థము
చేసికొనలేరు అని తెలుపబోవుచున్నాడు. దేవతలకు వేరు వేరు లోకాలు, భగంతునికి వేరు లోకము ఉందని ఇంతకు ముందే చెప్పి ఉన్నారు. అంటే
దేవతలు, భగవంతుడు, వ్యక్తులని, వారికి రూపములు, లోకమలు ఉన్నవన్నమాటే కదా! మరి భగవంతుడు నిరాకారుడు, ఇప్పుడు రూపాన్ని పొందాడు అనుటలో అర్థము లేదు. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు, సమస్త గుణములను కలిగిన ఆనందభరితుడు. నాల్గవ అధ్యాయములో చెప్పినట్లు ‘అజుడైనప్పటికీ ఈ లోకములో అవతరిస్తాడు. ‘బ్రహ్మ సంహితలో’ చెప్పినట్లు కేవలము వేదాలను చదివినంత మాత్రాన భగవంతుణ్ణి అర్థము చేసుకొనలేము. భగవంతుణ్ణి ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే హారే హరే రామ హరే రామ రామ రామహరే హరే’ అనే మహా మంత్ర ఉచ్చారణతో మొదలుగా ఆయనను సేవించి కృపను పొందనిదే, భగవంతుణ్ణి ఎన్నటికీ అర్థము చేసుకొనలేము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement