Tuesday, May 14, 2024

నృసింహావతార ఆవిర్భావం

కశ్యపుడికి విష్ణుమూర్తి అనుగ్రహంతో హిరణ్యకశిపుడు, హిర ణ్యాక్షుడు జన్మించారు. వారిద్దరూ పరమ క్రూరులు. విష్ణు ద్వేషులు. వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి అంతమొందిం చా డు విష్ణుమూర్తి. అది చూసిన హిరణ్యకశిపుడు ఎప్పటికైనా తనకూ ముప్పు ఉందని భావించాడు. బ్రహ్మకై ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తనకు ఇంటిలోపలా, వెలుపలా, పగలూ, రాత్రీ, నింగి, నేలపైన, నిప్పు, నీటిలో, నరులవల్ల, మృగాల వల్ల ఏ ఆయుధం చేతా మరణం లేకుండా వరాన్ని అడుగుతాడు. బ్రహ్మ తథాస్తు అంటాడు. అప్పటినుండి తానే దేవుడిగా భావిస్తాడు. దిక్కుతోచక ముక్కోటి దేవతలు శ్రీహరిని ప్రార్థిస్తారు. ‘కన్నకొడుక్కి ఆపద తలపెట్టినప్పుడు మరణిస్తాడు’ అని చెబుతాడు శ్రీహరి. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు బ్రహ్మజ్ఞాని. ఓనమాలు రాకముందే ‘ఓం నమో నారాయణాయ’ అంటూ అష్టాక్షరీ సాధన మొదలు పెట్టాడు. ఎల్లప్పుడూ హరి నామ‌స్మ‌ర‌ణే. గురువుగారి సన్నిధిలోనూ హరినామ‌స్మ‌ర‌ణే. గురువు చండామార్కుడు పరమ క్రూరుడు. నానావిధాలుగా హింసించినా ప్రహ్లాదుడు హరి నామస్మరణ మానలేదు. చివరకు తనవల్ల కావడంలేదని హిరణ్యకశిపు డికి అప్పగిస్తాడు. కుమారుడికి ఎంతో నచ్చజెప్పాలని చూశాడు హిరణ్యకశిపుడు. ఎంతకీ వినకపోవడంతో సోదరి హోళికకు అప్పగించి ప్రహ్లాదుడిని మంటల్లో వేయాలనుకున్నాడు. కానీ హోళికే అగ్నికి ఆహుతైపోతుంది. ఆగ్రహం పట్టలేని హిరణ్యకశిపుడు ‘ఎక్కడ నీ హరి’ అంటూ ప్రశ్నిస్తాడు. ‘ఇందుగలడందులేదని సందేహము వలదు. ఎందెందు వెదికిన అందందే కలడు’ అని సెలవిస్తాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నా డా నీ శ్రీహరి అని ఆ రాక్షసరాజు అడగగా, అవునం టాడు ప్రహ్లాదుడు. అప్పుడతను ఆగ్రహంతో గదతో స్తంభంమీద మోదగా ఆకాశం బద్దలైనట్టు, భూగోళం పేలిపోయినట్లు… సంద్రాలు ఉప్పొంగినట్టు స్తంభాన్ని చీల్చుకుంటూ బయటికొస్తాడు మహోగ్రరూపుడైన నరసింహుడు. భీకరంగా గర్జిస్తూ, ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద అదిమిపెట్టి గడపపై కూర్చుని గోళ్లతో వక్షస్థలాన్ని చీల్చి పేగుల్ని మెడలో వేసుకుని ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. మనిషీ జంతువూ కాని నరమృగరూపంలో, పగలూరాత్రీ కాని సంధ్యాకాలంలో, ఆయుదమని చెప్పలేని గోళ్లతో, ఇంటాబయటాకాక గుమ్మంలో, భూమిపైనా ఆకాశంలోనూగాక తన తొడలమీద హిరణ్యకశిపుని సంహరిస్తాడు శ్రీహరి. అదే నృసింహావ తారం ప్రత్యేకత.

Advertisement

తాజా వార్తలు

Advertisement