Tuesday, May 7, 2024

సీత దృష్టిలో రావణుడు తృణప్రాయమే!

అశోకవనంలో సీతాదేవిని చూసిన హనుమంతుడు ఆమెను చూసే అదృష్టం కలిగింది కదా, రామలక్ష్మణుల కార్యం నెరవేరింది కదా అని సంతోషపడ్తాడు. ఉత్తమురాలైన సీతకు ఎటువంటి కష్ఠమొచ్చిందని తల్చుకుంటూ ఏడుస్తాడు. అలా ఏడుస్తూనే ”ఈమె మహాపతివ్రత. ఆపద రాకూడదు. సీత ప్రకృతి కతీత. అందరిలాగా కర్మానుభవానికై పుట్టింది కాదు. అట్టి ఈమెకే దిగులు సంప్రాప్తిస్తే కాలాన్ని అతిక్రమించే వారెవరైనా వుంటారా? అదెవ్వరికీ సాధ్యంకాదు. రామచంద్రమూర్తి నిశ్చయం, లక్ష్మణుడి అభిప్రాయం ఎరిగింది కనుకనే, గుండెనిబ్బరంతో వుంది సీత. రాముడికి సీత, సీతకు రాముడు, వయస్సులో, స్వభావంలో ఒకరికొ కరు సరిపోయారు. ధర్మాత్ముడు, మహతాత్ముడు, మహాత్ముడు, మిధిలానాధుడు, జనకుడి కూతురు సీత ఈమె. సందేహంలేదు. ఇట్టి లక్షణాలు ఆమెలో తప్ప మరొకరిలో వుండవు” అనుకుంటాడు.
వివా#హకాలంలో శ్రీరాముడికి పన్నెండేళ్లు, సీతకు ఆరేళ్లు. అంటే రాముడి వయస్సులో సగం. శాస్త్ర ప్రకారం తగిన వయస్సే. ఇప్పుడు శ్రీరామచంద్రుడి వయస్సు ముప్ఫైతొమ్మిది సంవత్సరాలు, సీతకు ముప్ఫైరెండు. వధువుకు ఎనిమిదేళ్ళు వుంటే, వరుడికి పదహారేళ్ళు వుండాలని విష్ణు స్మృతి. సీత రాముడు వయస్సులో ఎలా ఈడూ జోడో, శీలంలోనూ అంతే. సార్వభౌమత్వ చిహ్నాలు రాముడికున్నా యి. అట్టివాని భార్యకు ఎలాంటి చిహ్నాలుండాలో అవన్నీ సీతకున్నా యి. సూర్యవంశంలో ప్రసిద్ధికెక్కిన వాడి కొడుకు రాముడైతే, చంద్ర వంశంలో జగత్ప్రసిద్ధికన్న జనకుడి కూతురు జానకి.
”స్మరణ మాత్ర సంతుష్టాయ” అంటే స్మరించినంత మాత్రాన సంతోషించేవాడు రాముడు. ”ప్రణతి ప్రసన్న జానకి” అంటే ఒక్క నమస్కారంతో సంతోషించేది సీత. ఇట్టి అపురూప దాంపత్యం లోకం లో ఎక్కడైనా వుందా అని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. భక్తుల కు సీతారాములిరువురూ సేవ్యులే. జగన్మాత ”శ్రీదేవి”, జగన్నాయ కుడు ”విష్ణువు”. ఒకరున్న చోటే రెండో వారుంటారు. వీరిరువురితోనే ప్రపంచమంతా వ్యాపించి వుంది. ఈశత్వం ఇద్దరిలో సమానమే. సర్వదా ఏకశేషులే! ఒకేమాటలో ఇరువురినీ తెలిపేదే ఏకశేషం. ఇలా ”సర్వకారణత్వం, సర్వవ్యాపకత్వం, సర్వనియన్తృత్వం” లక్ష్మీనారా యణుల్లో, సీతారాముల్లో వుంది. ఇరువురిలో, ”ఉపాయత్వం, ఉపే యత్వం” వున్నాయి. అందుకే సీతారాములిరువురూ సమానంగా సేవించాల్సిన వారేనని గ్రహంచాడు హనుమంతుడు.
రాముడు చేసే కార్యాలన్నింటికీ మూలకారణం సీతాదేవే! చేసేది రాముడు, చేయించేది సీత. నిగ్రహానుగ్రహాల రెండింటిలోనూ ఇదే నియమం. భగవంతుడు అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు కాగా అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకి లక్ష్మీదేవి. ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఆమె మూలాన్నే నామరూపాలై, స్థితిగలవై వున్నాయి.
సీతాదేవి వృత్తాంతమంతా ఏకమై, అనన్యమై, భగవత్‌ ప్రాప్తి ఎప్పుడా అని ఎదురు చూస్తుండే పరమభక్తురాలి చరిత్రే! అందుకే రామాయణాన్ని ”సీతాయాశ్చరితమ్‌ మ#హత్‌” అంటాడు వాల్మీకి. సీతాదేవి తాను చెరనుండి తప్పించుకోవటమే కాకుండా, తన లాగా దు:ఖిస్తున్న దేవ, గంధర్వ, నాగ మొదలైన జాతుల స్త్రీలను కూడా విడిపించింది. సీతాచర్య నేర్పేదిదే! ఇతర ఉపాయాలను వెత క్కుం డా, దేహాభిమానం, స్వాతంత్య్రం వదిలి, స్వరక్షణాభారం భగ వంతుడి మీద వేసి, ”అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగత్వం” అనే అకారత్రయ సంపూర్తిని కలిగి, సంసారంలో వుండే తరించేటందుకు ”ప్రపత్తితోనో, పరమ భక్తితోనో” సాయుజ్యాన్ని పొం దవచ్చని, సీతాదేవి చరిత్ర వలన తెలుసుకోవచ్చు. అంటే, భగవ త్ప్రా ప్తి కోరేవాడు, ఆయన అనుగ్రహం కొరకు సీతాదేవిలాగా, భగవన్నా మాన్ని వుచ్చరిస్తూ వుండడం తప్ప వేరే మార్గంలేదు.
సీతాదేవి శ్రీరాముడినొక్కడినే చూడాలనుకుంటుంది. అంటే, ఇది, ”ఏకాగ్రభక్తి, ఏకభక్తి, అనన్యత్వాన్ని” గురించి చెప్పటమే. అలానే, భక్తుడు దేవతలెందరున్నా, తన ఇష్ట దైవాన్నే నమ్మి, ”ఏకభక్తి, ఏకాగ్రభక్తి” కలవాడై వుంటాడు. అలానే భక్తులు, ప్రపన్నులు, తమ కెన్ని కష్టాలొచ్చినా, విశ్వాసం వదలకుండా, భగవంతుడు రక్షించే దాకా, తమ ”భక్తిప్రపత్తులే” తమకు రక్ష అని భావిస్తారు. పతివ్రత తన భర్తకంటే ధనవంతులు, విద్యావంతులు, రూపవంతు లు, బలవం తులు లోకంలో ఎందరున్నా భర్తకంటే అధముల్లాగానే ఎంచుతుంది కాని, వారిని ప్రేమించదు. దు:ఖం వస్తుంటే, పరితపిస్తున్న సీత కనిపించింది హనుమంతుడికి. సీత సమీపంలోనే ఆమెకు దిగులు కలిగిస్తున్న వికార ఆకారాల రాక్షస స్త్రీలనెందరినో చూసాడు. సీత చుట్టూ తిరుగుతూ, అరుస్తూ, కేకలేస్తున్న రాక్షస స్త్రీలను చూసిన హనుమంతుడి దే#హం పులకరించింది. ఆయన కంటికి వారంత భయంకరంగా వున్నారు. రాక్షసులింకా మేలుకునే వున్నారు కాబట్టి, చెట్టు మీదనే వుండిపోయాడు హనుమంతుడు. కాంతి తొలగిన ముఖమున్నప్ప టికీ, భర్త పరాక్రమం తలచుకుంటూ, ఆయన తనను తప్పక రక్షిస్తా డన్న ధైర్యంతో కనిపించిందామె. సీతను చూసి సంతో షంతో హనుమంతుడి కళ్లల్లో నీరు ప్రవ#హంచింది. ఇదంతా రామ లక్ష్మణుల అను గ్రహంతో లభించిందే కదా అని వారికి నమస్కరించి, సీతతో మాట్లాడే సమయానికై, చెట్టుకొమ్మపైనే వేచి చూడసాగాడు.
దాదాపు రాత్రంతా గడిచిపోయి, తెల్లవారుతున్న సమయంలో, రావణుడు సీతను తలచుకుంటాడు. కంటికి ఇంపైన అశోకవనంలోకి, భూషణాలు ధరించిన రావణుడు ప్రవేశించాడు. కామాతిశయంతో కన్నుమిన్ను కానని రావణుడు, సీత తనకు వశపడుతుందని, మూ ఢుడై పర స్త్రీల పట్ల పాటించాల్సిన కనీస మర్యాదను కూడా మరచి అశోకవనంలోకి ప్రవేశిస్తాడు. సీతాదేవిని సమీపించాలని అనుకుంటా డు. వాడిని చూసిన హనుమంతుడు, తను చూస్తున్నది రావణుడినే నని అనుకుంటాడు. పూర్తిగా చూసేందుకు, అనువైన స్థలం చేరి, రావణుడు ఎదురుగా కనిపించేలా బలవంతు డు అయినప్పటికీ, వాడి తేజస్సు ముందర తేజోహనుడై కొమ్మల నడుమ దాగాడు.
రావణాసురుడు, తనవైపు రావడం, దూరాన్నుండే చూసిన సీత, వణకసాగింది. ఆలస్యం చేయకుండా, తన శరీరాన్ని భయంతో కప్పుకుంటుంది. పవిత్రురాలైన సీతను, పాపాత్ముడైన రావణుడు, తన మరణ దశ దగ్గరపడడంతో, సమీపించాడు. రావణుడు, తియ్యటి మాటలతో, తన మనసులోని ఆలోచనను, పతివ్రతా శిరో మణౖన సీతకు చెప్పాడు. ”సౌందర్య గనీ! నన్ను గౌరవించు. నీవు భయపడాల్సిన అవసరంలేదు. నేను రాక్షసుడనైనప్పటికీ, నీమీద కామంతో వచ్చానేకాని నిన్ను చంపడానికి రాలేదు. నీకు పాప భయ మక్కరలేదు. నువ్వు భయపడవద్దు. నన్ను అనుగ్రహ దృష్టితో గౌర వించు. నీకు సరితూగే స్త్రీ ఈలోకంలో లేనేలేదు. నిన్ను పొగడడం నాకు సాధ్యం కావడంలేదు. అజ్ఞానం వదలి నా భార్యవు కా. పట్టపు రాణి వి కా. నామణులు, రాజ్యం, నీ సొత్తే”. ఇలా తనను పొగుడుకున్న రావణుడు ఆ తరువాత శ్రీరాముడిని దూషించాడు.
రావణుడి ద్వారా ఇలాంటి మాటలు వినాల్సివచ్చె కదా అని, మనసులోనే దిగులుపడుతుంది సీత. తనను తాకుతాడేమోనని భయంతో వణకింది. ఆపత్కాలంలో దేవుడిని ప్రార్థించినట్లే, పతివ్రత లకు భర్తే దైవం కనుక, శ్రీరాముడిని తలచుకుంది. తనను చేయలేడ న్న ధైర్యం తెచ్చుకుని, తన కోసం ఏడవకుండా, భర్తకు తనవల్ల దు: ఖం వచ్చింది కదా అని బాధపడింది. చెప్పినా వినకుండా, తన కార ణాన రావణుడు సర్వనాశనమైపోతున్నాడే అని, అతనుకొరకూ కన్నీ రు కార్చింది. ఇలా అనుకుంటూ, పరిశుద్ధమైన చిరునవ్వు ముఖంతో ఒక ”గడ్డిపోచ”ను తనకడ్డంగా రావణుడి ముందు పడేసింది సీత.
రావణుడు దుష్టుడైనా ప్రభువు, పైగా తన దగ్గర కొస్తున్నాడు కాబట్టి అతిథే. అతిథిని సత్కరించాలని శాస్త్రాలు చెప్పుతున్నందు వల్ల తనకు లభించిన ”తృణం” వాడివైపుకు వేసిందని ఒక భావన. ”నిన్ను నేను తృణప్రాయంగా చూస్తున్నాను. ఈతృణం నన్నేమి చేయ గలదో నువ్వూ అంతే” అనేది మరో అర్థం. ఇలా ఎన్నో అర్ధాలను, విశే షాలనూ సెలవిస్తారు మన పెద్దలు గడ్డిపోచను మధ్యలో వేయడంలో. అలా రావణుడిని తృణప్రాయంగా చూసి కర్తవ్య బోధచేసింది సీత.
”రావణా! రామచంద్రమూర్తి నుండి నన్ను వేరు చేయడం నీకు చేతనవుతుందా? శ్రీరాముడికి నేను ”అనన్య”ను. నన్నాయన నుండి వేరు చేయలేవు. నీవు అవివేకివి. నేను రాముడి దానినైనా, ఆయన మీద ఆధారపడ్డ పరతంత్రనైనా, నేనే ఆయన్ను లోకానికెక్కువగా వుపయో గపడేటట్లు చేస్తున్నాను. ఆయన మహమ లోకమంతా తెలవడం నావల్లనే. నేను లేకపోతే, ఆయన ఉనికేలేదని చెప్పాలి. నా భర్తను ఎడబాసి వగస్తున్న నా దగ్గరకు, నా మగడిని తెచ్చి విడువు. అలాచేస్తే నిన్ను ”నయమతి” అంటారు. నేను చెప్పినట్లు చేయి. లేదంటే రాము డు నిన్ను చంపడం ఖాయం” అంది. మారీచుడు రావణుడితో ”జన కాత్మజ సంబంధంబున రాముండప్రమేయ పురుతేజుండయ్యె”నని చెప్పాడు. అవివేకైన రావణుడికి అది అర్థం కాలేదని సీత గుర్తుచేస్తుం దిక్కడ. ప్రపంచం లేకపొతే భగవంతుడు లేనేలేడు. ఆ భగవంతుడి శక్తే ”లక్ష్మి”. ఎప్పుడెప్పుడు విష్ణువు అవతారమెత్తుతాడో, అప్పుడన్ని సమయాల్లో శ్రీదేవి ఆయనకు సహాయంగా రావాల్సిందే. విష్ణు దేహా నికి అనురూపమైన దేహాన్ని ధరిస్తుంది. ఆమె ”అనన్య”. అంటే, చీకటి వెలుతురు లాగా అన్యం కాకుండా వుంటుంది.
సీతాదేవి కఠినంగా మాట్లాడుతుంటే, కోపించిన రావణుడు, ”జానకీ! పన్నెండు నెలల గడువిచ్చాను. ఇంకా రెండు నెలలు మిగిలాయి. అంతవరకు వేచిచూస్తాను. ఈలోపల నువ్వు నాకు వశం కాకపోతే గడువు తీరిన మర్నాడే, నా వంటవాళ్లు నిన్ను, నా ఉదయం భోజనంలో నంచుకోవటానికి వండుతారు”. రావణుడి బెదిరింపు మాటలకు సీత భయపడలేదు. ఆమే చాలా రకాలుగా బెదిరించింది. తానే రావణుని భస్మం చేయగలిగినా, పరతంత్రురాలినైనందున అలా చేయడం లేదన్నది.
నయాన భయాన, సీతాదేవి చెప్పిన మాటలు రుచించని రావ ణుడు, సీతను నానా రకాలుగా నిందించాడు. అక్కడున్న నానారకాల రాక్షస స్త్రీలను ఆమెపైకి పురుగొల్పుతాడు. సీతాదేవిని తన వశమ య్యేటట్లు చేయమంటాడు. ఇట్లా బెదిరిస్తూ, రాక్షస స్త్రీలను ఆజ్ఞాపి స్తూ, సీతను మళ్లిమళ్లి చూస్తూ, రాక్షస స్త్రీలు, తన చుట్టూ సేవిస్తుండగా, సీతను మరోమారు బెదిరించి వెళ్లిపోతాడు రావణుడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయ ణం మందరం ఆధారంగా)


– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement