తిరువనంతపురం : దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగం వరకు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి. అయినా ఇలాంటి సమయంలో కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నిబంధనల ప్రకారం.. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు వెల్లడించింది. మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని శబరిమలలోని అయ్యప్ప కొండను సందర్శించే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నవంబర్ 16వ తేదీ నుంచి శబరిమలలో తీర్థ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోజుకు 25వేల మంది భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేశారు. కరోనా రెండు టీకాలు వేయించుకున్న వారు లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ నివేదిక ఉన్న భక్తులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించను న్నట్టు తెలిపారు. అయితే అయ్యప్ప స్వామి దర్శనం తరువాత భక్తులు సన్నిధానంలో ఉండటానికి అనుమతి లేదని, వెంటనే తిరుగు పయనం కావాల్సి ఉంటుందని చెప్పారు. మార్గదర్శకాలను ప్రతీ ఒక్కరు పాటించాల్సి ఉంటుందని వివరించారు. అయ్యప్ప అభిషేకం తరువాత భక్తులకు నెయ్యి ఇచ్చే ఏర్పాట్లు చేయాలని దేవస్థానం బోర్డును కేరళ ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది లాగానే.. యాత్రికులను ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలో.. పుల్కేడు మీదుగా సన్నిధానానికి అనుమతించకూడదని సూచించింది. నీలక్కల్ వరకు మాత్రమే భక్తుల వాహనాల ను అనుమతిస్తారు. స్నానానికి పంపా నదికి వెళ్లేందుకు భక్తులు ఆర్టీసీ బస్సులను ఉపయోగించాల్సి ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement