Saturday, May 18, 2024

యోగుల మార్గాలే వేరు

మరణం అందరికీ ఉంటుంది. పుట్ట్టిన వాడు గిట్టక మానడు. జాతస్యహి ధ్రువో మృత్యు: అంటారు. అవతార పురుషుల నుంచి సామాన్యుల వరకూ అందరూ మర ణిస్తూనే ఉంటారు. అవతార పురుషులైన వారిలో రాముడు సరయూ నదిలోనికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు యదు వంశమునకు ఉన్న శాపం వలన ముసలం మొన చేత దెబ్బతిని దేహం చాలించాడు. కారణ జన్ములైన పాండవులలో ధర్మజుడు మినహా మిగతా వారు చివర స్వర్గారోహణ పర్వంలో ఒక్కొరొక్కరే పడిపోయి జన్మ పరిసమాప్తి నొందారు. ఆదిశంకరులు అలా హిమాలయాల్లోకి వెళ్లిపోయారని చెబుతారు. కొందరు యోగులు అనారోగ్యంతో దేహం చాలించిన సందర్భాలూ ఉన్నాయి. కొందరు మామూలుగానే మరణించారు. అయితే సామాన్యులకు, అవతార పురుషులకు, యోగ సిద్ధుల్లో కొందరికి, మరణం గాని, మరణానంతరం వారు చేరే ప్రదేశాల విషయంలో, ప్రయాణించే మార్గాల విషయంలో తేడా ఉంటుంది. కొందరు ఉపాసకులు సూర్యలోకానికి వెడతారని చెబుతారు. కొందరు మోక్షం పొందినట్లు చదువుతూ ఉంటాము. కొందరు స్వర్గ నరకాలలో కొంతకాలం ఉండి తిరిగి మానవ జన్మ ఎత్తుతారు.
అయితే యోగులు సాదారణంగా సామాన్య మానవుల మాదిరి శరీరాన్ని విడిచిపెట్ట్టరు. యోగులు ఇంద్రియ ద్వారములన్నింటిని అరికట్టి, మనస్సును హృదయమునందు నిలిపి ఓం అనే ఏకాక్షరమైన బ్రహ్మ మంత్రమును ఉచ్చరిస్తూ పరమ గతిని పొందుతారు.
ఇంద్రియ ద్వారములైన, ముక్కు, చెవులు మొదలగు వానిని గురించిన చింతనలు యోగికి ఉండవు. అంత్యకాలము ఆసన్నమయినప్పుడు యోగి మనస్సు, సాయం కాలమయిన వెంటనే గూడు చేరు పక్షులవలె, హృదయమునందు చేరిపో తుంది. యోగులు కాని వారికి మనస్సు ప్రాపంచిక విషయ ములందు ఆసక్తి ఉన్నందున వాటి చుట్టూ పరిభ్రమి స్తూ ఉంటుంది. శరీరమంతా చల్లగా అవుతంది. అనగా ప్రాణము ఒక్కొక్క అవయవమును విడిచి పెడుతుంది. బండ్లు, నిలుచు స్థలమునకు వచ్చు ప్రయాణికుని వలె ప్రాణము అవయ వములను ఒక్కొక్కటిగా విడిచి పె ట్టి శిరస్సుపై భాగమునకు వచ్చి చేరు తుంది. కావున ఆ చోట మాత్రమే వేడి ఉంటుంది. యోగికాని వారికి ము క్కు ద్వారా లేక నోటిద్వారా ప్రాణము పోతుంది. ఈశ్వర చింతన అధికమై ఈశ్వర స్వరూపమునందు మనస్సు లగ్నమై ఉండడాన్ని యోగ ధారణమం టారు. యోగులు ఈ పద్ధతిలో ప్రాణాలు విడుస్తారు. అయితే ఇతరుల శరీరము వలె యోగి శరీరము కూడా శవమే అవుతుంది. అయినప్పటికి యోగి మాత్రం మోక్షపథమును పొందుతాడు.
శ్రీరామకృష్ణుని ఉపదేశము అనుసరించి ఈ ప్రపంచమును విడిచి పెట్టి పోవు తరుణమున జీవుడు దేనిని గురించి తలచు కొంటూ ఉంటాడో దానికి తగిన శరీరాన్నే మరల పొంది జన్మిస్తాడు.
కావున భక్తి సాధన అత్యవసరం. మరణ సమయమునందు ఈశ్వర చింతనమే ఆత్మయందు నెలకొని ఉండాలి.
మరణ కాలమున ఆ చింతన తనంతట తానే వస్తుందా అంటే రాద నే చెప్పాలి. అందువల్ల మొదటి నుంచి సాధకుడు దానికి తనను తాను సంసిద్ధం చేసుకోవాలి.
యోగులు మాత్రమే ఆత్మ పరమాత్మ తత్వ జ్ఞానము వలన శరీర పతనమును మరణమనే భావనతో చూడరు. ఇదియే వారి ఆత్మ విజయము. యోగుల దేహమునుండి ప్రాణములు వెళ్లు సమయంలో పాదముల యందు విష్ణు దేవుడుంటాడు. అలాగే పిక్కలలో వసువులు, మోకాళ్ళ వద్ద సాధ్యులు, జననేంద్రియ ములో సూర్యుడు, గుదమందు భూ దేవత, తొడలలో ప్రజాపతి, బొడ్డులో చంద్రుడు, చేతులలో ఇంద్రుడు, రొమ్మువద్ద శివుడు, నోరులో విశ్వే దేవతలు, చెవులలో దిక్పాలకులు, నాసికలో వాయు దేవుడు, కళ్ళలో అగ్ని దేవుడు, నొసలులో పితృదేవతలు, తలలో బ్రహ్మదేవుడు, మొదలైన దేవతలు స్థానమును చేసుకొని ఉంటారు. యోగి ఆయా దేవతలను పొందుచున్నాడు.
సత్వ గుణ యోగి సూక్ష్మ శరీరము జ్యోతిర్బిందు రూపము లో ఉండును. సిద్ధ యోగి శరీరమును విడిచిపెట్టి నపుడు ఆత్మ భూమ్యాకర్షణను చేదించి చంద్ర మండలము వైపు వెళుతుంది.
జీవవవన్ముక్తులైన యోగులు జ్యోతిర్మయ మార్గమును అనుసరిస్తారు.
సూర్యమండలము దాటి వెళ్ళిన వారు తిరిగి భూ మండలముపై జన్మించరు. అట్టివారు ఆకాశ గంగతో బాటు తిరుగుచు విష్ణు పథములోకి ప్రవేశించి విష్ణు లోకాన్ని చేరుతారు. అందరూ యోగులే అయినా వారు వెళ్లే ప్రదేశాలు, మార్గాలే వేర్వేరుగా ఉంటాయి.


కోసూరు హయగ్రీవరావు
99495 14583

Advertisement

తాజా వార్తలు

Advertisement